ఇలాంటోళ్లకు వత్తాసు ఉంటే వైసీపీ పరువు పోదా?

అమ్మాయిలను ట్రాప్ చేసి పోర్న్ వీడియోలు షూట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. హత్యకు కుట్ర చేసి అడ్డంగా పోలీసులకు చిక్కిపోయిన వాడు.. హత్యకేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. అయిన వ్యక్తిని వెనకేసుకు రావడానికి ఎలాంటి రాజకీయ నాయకుడు అయినా జంకుతారు. కానీ.. ఇప్పుడు ఇలాంటి అన్ని తప్పులూ చేసిన వ్యక్తిని పోలీసుల చెరనుంచి బయటకు తీసుకురావడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. ఇలాంటి వారికి వత్తాసు నిలిస్తే మొత్తంగా పార్టీ పరువే పోతుందనే భయం వైసీపీ వారిలో ఉందో లేదో అనే అనుమానం కలుగుతోంది.

ఇదంతా గుంటూరు నగరానికి సంబంధించిన నేర రాజకీయాల వ్యవహారం. నగరంలోని తెలుగుదేశం కార్పోరేటర్ యల్లావుల అశోక్ యాదవ్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందిన సమాచారంతో అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్

ముందుజాగ్రత్తతో వ్యవహరించి ఈ కుట్రను భగ్నం చేశారు. అశోక్‌ను మట్టుబెట్టేందుకు కన్నెగంటి బాలకృష్ణ పథకం వేసినట్లు తెలిసిన తర్వాత.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిద్దరి మధ్య చాలాకాలం కిందటినుంచే వైరం ఉంది. గత ఎన్నికల్లో అశోక్ ను ఓడించేందుకు బాలకృష్ణ విశ్వ ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. ఇదే బాలకృష్ణ అనే వ్యక్తికి గతంలో రౌడీ షీటర్ బసవల వాసు హత్య కేసుతో కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో బాలకృష్ణను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఇప్పుడు కూడా, బాలకృష్ణను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో ఓ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి నగ్న చిత్రాలు, పోర్న్ వీడియోలు తీసిన కేసులో బాలకృష్ణపై ఆరోపణలు వినిపించాయి. ఇలా ప్రజల దృష్టిలో అన్ని రకాలుగానూ భ్రష్టు పట్టిపోయిన నాయకుడిని కాపాడడానికి వైసీపీ నాయకులు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది మాత్రం అర్థం కావడం లేదు.