నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అవును, అవును 2, సిల్లీ ఫెలోస్, సీమ టపాకాయ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా, మంచి నటిగా ఫ్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న చిత్రాల్లో `అఖండ` ఒకటి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూర్ణ.. అఖండ గురించి, బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మూవీలో బాలకృష్ణ, తనకు మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయని తెలిపిన పూర్ణ.. ఆయన వ్యక్తితత్వం చాలా గొప్పదని చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే పూర్ణ మాట్లాడుతూ.. `బాలయ్య లాంటి వ్యక్తిని ఇంత వరకు చూడలేదు. నేను కూడా `అది బాలేదు, ఇది బాలేదు` అంటూ కంప్లైంట్ చేస్తా. కానీ ఆయన అలా కాదు. ప్రతిరోజు సెట్కు వస్తారు. డైరెక్టర్ ఏమి చెప్పినా అలానే అంటారు. మరో మాట కూడా మాట్లాడరు. అందుకే నా ఫోన్ వాల్పేపర్గా ఆయన ఫొటోనే పెట్టుకున్నాను. ప్రతిరోజు లేవగానే ఆయన ఫొటోను చూసి ఎటువంటి కంప్లైంట్లు లేకుండా సింహంలా పనిచేయాలి. అలాగే బాలయ్యతో మరిన్ని మూవీస్ చేసి, ఆయన నుంచి మరింత స్ఫూర్తిని పొందాలి.` అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.