పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా గన్నుతో చెలరేగిపోయాడు. అవును, మీరు విన్నది నిజమే. అసలు విషయం ఏంటంటే.. పవన్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అయితే ఈ మధ్య భీమ్లా నాయక్ విడుదలపై కొన్ని రూమర్లు వచ్చాయి. చిరంజీవి ఆచార్య సంక్రాంతి బరిలోకి రానుందని, అందుకోసం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వాయిదా పడబోతోందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా భీమ్లా నాయక్ మేకర్స్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు `బ్రేక్ టైమ్ ఇన్ భీమ్లానాయక్ స్టైల్` అంటూ ఓ వీడియోను వదిలారు.
ఇందులో పవన్ తెల్ల దుస్తులు ధరించి కారు పక్కన తుపాకి పట్టి శత్రువుల గుండెల్లో బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఆయన అడవిలోకి తుపాకీ పట్టుకుని ఒంటరిగా వెళ్తుండగా..`యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు.. యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు.. నాయకుడు ఈ రెండింటిని భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు` అని రాసుకొచ్చారు. అలాగే ఈ వీడియోలో జనవరి 12నే భీమ్లా నాయక్ రాబోతోందని తెలిపారు. మొత్తానికి ఆకట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.