తగ్గేదే లే… అంటోన్న మెగాస్టార్!

ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తూ తమ ఇమేజ్‌ను అంతర్జాతీయంగా మరింత పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, బన్నీ పుష్ప, తారక్-చరణ్‌లు ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఓ ఆటాడేందుకు రెడీ అవుతున్నారు. అయితే వీరికి ధీటుగా ఇప్పుడు ఓ సీనియర్ హీరో కూడా పాన్ ఇండియా సబ్జెక్టుతో రావాలని చూస్తున్నారు. ఇంతకీ ఆ సీనియర్ హీరో ఎవరో కాదు.. మన మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో ఓ కేమియో రోల్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన తాజా చిత్రాన్ని ప్రారంభించాడు చిరు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాకు దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌ను తాజాగా స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చిరంజీవి నుండి పాన్ ఇండియా మూవీ రాకపోవడంతో, ఈసారి భారీ ఎత్తున ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. దీనికోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను సైతం ఈ సినిమాలో నటింపజేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సబ్జెక్టుతో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను మెప్పించవచ్చని చిరు భావిస్తున్నాడు. మరి యంగ్ హీరోలకు ధీటుగా మెగాస్టార్ పాన్ ఇండియా మూవీ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.