టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్గా కనిపించనున్నాడు.
కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్.. మళ్లీ ఇటీవలె హైదరాబాద్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక ఇతర తారలు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. అయితే లేటెస్ట్ సమాచారం.. ఇప్పుడు మళ్లీ పుష్ప షూటింగ్కు బ్రేక్ పడినట్టు గుసగుసలు వినిపిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పుష్ప షూటింగ్ స్పాట్ తీవ్రంగా దెబ్బతిన్నదట. దాంతో కొన్ని రోజుల పాటు షూటింగ్ను నిలిపి వేశారట మేకర్స్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. కాగా, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ విలన్గా కనిపించనున్నారు.