తెలుగు దేశం పార్టీకి, అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య కూడా ఆమెనే అనుసరిస్తారని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్సభ స్థానానికి పోటీచేసిన పనబాక లక్ష్మి.. ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఇక ఓడిపోయినప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాలకు సైతం ఆమె హాజరు కాలేదు. అయినప్పటికీ ఈ మధ్య జరిగిన తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో ఆమెకే సీటు ఇచ్చారు చంద్రబాబు. అభ్యర్థిని ముందుగానే ప్రకటించినా.. పనబాక లక్ష్మి మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన లేదు. పార్టీ మారే ఆలోచనతోనే ఆమె ఇలా చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
చివరకు ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. ఆమెను మళ్లీ ఓటమే పలకరించింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇంకా టీడీపీలోనే ఉంటే తన రాజకీయ భవిష్యత్తు అంతంత మాత్రమేనన్న అభిప్రాయంతో పనబాక లక్ష్మి పార్టీని వీడి.. బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.