ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించాలని నెడ్క్యాప్ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో జులై మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా తొలిదశలో లక్ష వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండానే నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే నేరుగా చెల్లించేలా వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆసక్తి ఉన్న సిబ్బంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది.
బ్యాటరీ సామర్థ్యం, వేగం ఆధారంగా వాహనాల ధర ఉంటుందని పేర్కొంది. ఒక్కో కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుంది. బండి వేగాన్ని బట్టి గరిష్టంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ సబ్సిడీ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండిస్టీస్ రాయితీ సొమ్ము చెల్లిస్తుంది. ఈ వాహనాలు గంటకు 25 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నడవనున్నాయి. ఈ మేరకు నెడ్క్యాప్ ఎండి రమణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాల వల్ల రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఈ కాలుష్యాన్ని కొంతైనా తగ్గించాలనే ఉద్దేశ్యంతో నెడ్క్యాప్ విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది.