ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు.
దాంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసిన ఏపీ సర్కార్.. శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలితే పంపిణీ జరపాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఆనందయ్య మందుకు సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతున్నారు. తాజాగా నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఆనందయ్య మందుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నాకు ఆయుర్వేదంపై నమ్మకం ఉంది. ఆనందయ్య ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మందు వేస్తున్నారు.అది పని చేస్తోందని ఎంతో మంది చెబుతున్నారంటే అందులో ఎంతో కొంత నిజముంటుంది కదా?.. నేను ఆయన మందును నమ్ముతున్నాను అని రేణు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవల జగపతి బాబు, నందమూరి బాలకృష్ణ కూడా ఆనందయ్య మందుకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.