అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించి తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్రానికి అదిరిపోయే ఆఫర్ను ఇచ్చిందని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదని.. కరోనా పరిస్థితులు కుదుట పడ్డాక, థియేటర్లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ను విడుదల చేస్తామని కండబద్దలు కొట్టారు.