విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈయన ధరించని పాత్రలేదు. పోషించని రసం లేదు. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకతలు, కాకమ్మ కథలు, కాలక్షేపం కథలు ఇలా అన్నీ చేసిన ఎన్టీఆర్.. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని, తిరుగులేని నెంబర్ వన్ హీరోగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. వెండితెరపైనే కాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి చరిత్రలో మిగిలిన యుగపురుషుడీయన.
ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. `ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణాంతరం భారతరత్న ఇచ్చినట్లు మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుగారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం.
వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం` అని చిరంజీవి ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం చిరు ట్వీట్ వైరల్గా మారింది. చిరు వ్యాఖ్యలకు పలువురు మద్దతు కూడా పలుకుతున్నారు.
https://twitter.com/KChiruTweets/status/1398120483493580803?s=20