కంటికి కనిపించని శత్రువు అయిన కరోనా వైరస్ మళ్లీ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు మళ్లీ లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందుపై అందరి చూపు పడింది.
ఆనందయ్య మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసిన ఏపీ సర్కార్.. శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలితే పంపిణీ జరపాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఆనందయ్య మందుకు పలువురు మద్ధతుగా నిలుస్తున్నారు. తాజాగా ఆనందయ్య మందుపై తెలుగు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. నాకు నమ్మకం ఉందయ్యా. అభిమానం లేనిదే ఆరాధన లేదు.. ఆరాధన లేనిదే మతం లేదు. మతం లేనిదే మానవుడే లేడు. అలాగే ప్రతీది ఒక నమ్మకం.. నేను ఆనందయ్య మందును నమ్ముతాను. ఎందుకంటే, గొప్పగొప్ప వైద్యులున్నారు. క్రీస్తు పూర్వమే సుశంకుడనే వైద్యుడుండే వాడు.. ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఇవాళ్టికి కూడా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీ లో ఆయన పేరుంది అంటూ పేర్కొన్నారు బాలయ్య.