అలాంటి వాళ్లను దేవుడే శిక్షించాలి : చంద్రమోహన్

ఇండ‌స్ట్రీతో సంబంధం లేకుండా ప‌లువురు ప్ర‌ముఖ స్టార్స్ బ్ర‌తికి ఉన్న‌ప్పుడే చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియాలో పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ల‌య‌, వేణు మాధ‌వ్‌, కోట శ్రీనివాస రావు, చంద్ర‌మోహ‌న్, చంద్ర‌ముఖి ద‌ర్శ‌కుడు పి.వాసు ఇలా ఒక‌రేంటి ఎంద‌రో సెల‌బ్రిటీలని బ్ర‌తికి ఉండ‌గానే చంపేశారు కొంద‌రు మేధావులు. అయితే అవి అవాస్త‌వాల‌ని, వాటిని ఖండిస్తూ మీడియా ముందుకి వ‌చ్చి వారు వివ‌ర‌ణ ఇచ్చుకున్న‌ సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. 23న చంద్రమోహన్ 81వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా.. వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమాలకు సంబంధించిన విషయాల గురించి చెప్పుకోచ్చారు. చంద్రమోహన్ హీరోగా నటిస్తే కేవలం 50 సంవత్సరాలు మాత్రమే ఇండస్ట్రీలో ఉండేవాడినని..

కానీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే.. ఆల్ రౌండర్ అనిపించుకోవాలని అందుకే.. అన్ని పాత్రలు చేయడం ప్రారంభించానని చెప్పుకోచ్చారు. అలా నిర్విరామంగా 50 సంవత్సరాలు సినిమాలు చేస్తూ.. ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశానని చెప్పారు. రాఖీ సినిమా చేస్తున్న సమయంలో బైపాస్ సర్జరీ చేయించుకున్నానని.. అలాగే.. దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో ఆరోగ్య సమస్యలతో షూటింగ్ కూడా వాయిదా వేశానని చెప్పారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితులు.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సినిమాలు చేయనని చెప్పారు. గత కొద్ది రోజులుగా చంద్రమోహన్ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన సన్నిహితులు స్పందించారు. ప్రస్తుతం చంద్రమోహన్ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఆయనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాం. గతంలో కూడా ఆయన ఆరోగ్యంపై రూమర్లు సృష్టించారు. అలాంటి వాళ్లను దేవుడే శిక్షించాలి అంటూ అసహనం వ్యక్తం చేశారు.