వివాదాల సుడిగుండంలో విలవిల్లాడుతోన్న కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ మెర్సల్ ఈ వివాదాలను బాగా క్యాష్ చేసుకుంటూ వసూళ్ల దుమ్ము దులిపేస్తోంది. విజయ్కు ఎప్పుడో తుపాకీ, కత్తి లాంటి సినిమాల తర్వాత సరైన సినిమా పడలేదు. ఇక చాలా రోజుల తర్వాత మెర్సల్కు మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడేస్తోంది.
ఓ వైపు జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఈ డైలాగులు తొలగించాలని చెప్పడం, మరోవైపు రాహుల్గాంధీ నుంచి పలువురు సినీ ప్రముఖుల వరకు ఈ సినిమాకు మద్దతుగా మాట్లాడడంతో సినిమాకు కావాల్సినంత ప్రీ పబ్లిసిటీ వచ్చేసింది. వాస్తవంగా చూస్తే సినిమాకు ముందుగా మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా వివాదాలతో సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
ఆరు రోజుల్లో తమిళనాడులో మొత్తం రూ. 84 కోట్లు మెర్సల్ కొల్లగొట్టి సూపర్స్టార్ రజనీ కబాలీ సినిమా రికార్డులను తుడిచిపెట్టేసింది. రజనీ కబాలీ అక్కడ ఆరు రోజులకు రూ. 75.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో తమిళనాడు వరకు రజనీ రికార్డును విజయ్ బ్రేక్ చేసినట్లయింది.
ఇక వరల్డ్ వైడ్గా నాలుగు రోజులకే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ఇప్పటికి రూ. 155 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా లాంగ్ రన్లో సులువుగానే రూ.225 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో త్వరలోనే రిలీజ్ కానుంది.