బాలయ్యకు, వర్మకు ధీటుగా ఎన్టీఆర్ మూడో బ‌యోపిక్‌

దివంగ‌త లెజెండ్రీ హీరో, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రామారావు జీవిత చ‌రిత్ర‌కు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై ఇప్ప‌టికే రెండు బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతుండ‌డంతో తెలుగు సినిమా వ‌ర్గాల్లోను, రాజ‌కీయ వ‌ర్గాల్లోను కాక రేపుతోంది. ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌య్య హీరోగా – తేజ ద‌ర్శ‌క‌త్వంలో బ‌యోపిక్ వస్తుంటే, సంచ‌ల‌న దర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ ఎన్టీఆర్ జీవితాన్ని ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

వీటిల్లో బాల‌య్య – తేజ బ‌యోపిక్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుక‌గా వ‌చ్చే యేడాది మే 28న రిలీజ్ చేయాల‌ని ముందుగా అనుకున్నా అది ఆ టైంకు వ‌స్తుందా ? లేదా ? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా రిలీజ్ చేస్తారా ? అన్న‌ది కాస్త సందేహంగా ఉంది. ఇక వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ను ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభించి అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ రెండు బ‌యోపిక్‌ల‌ను డైరెక్ట్ చేస్తోంది గురు శిష్యులు అయిన వ‌ర్మ‌, తేజ‌లే కావ‌డం

ఈ రెండు బ‌యోపిక్‌లే ఇప్పుడు కాక రేపుతున్నాయి అనుకుంటే ఇప్పుడు అదే ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై మ‌రో బ‌యోపిక్ వ‌స్తోంది. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై తాను కూడా సినిమా తీస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి షాక్‌ల‌కే షాక్ ఇచ్చారు. ఆయ‌న మ‌రో షాకింగ్ ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి వాణీ విశ్వ‌నాథ్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని కూడా ఆయన తెలిపారు.

ఇప్ప‌టికే ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై రెండు బ‌యోపిక్‌లు వ‌స్తుంటే ఇప్పుడు మ‌రో బ‌యోపిక్‌పై ప్ర‌క‌ట‌న వ‌చ్చేసి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల న్యూస్‌ను మ‌రింత హీటెక్కించేసింది. ఇక తాజా బ‌యోపిక్‌లో ల‌క్ష్మీపార్వ‌తి రోల్‌ను వాణీ విశ్వ‌నాథ్ చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాల‌ను జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు.