కూతురు కోసం టీడీపీ మంత్రి తెగింపు..!

రాజ‌కీయాల్లో ప్ర‌జా సేవ క‌న్నా సొంత సేవ ఎక్కువైన విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు. ప్ర‌స్తుతం ఈయ‌న టీడీపీలో ఉన్నా.. మ‌న‌సు మాత్రం ఈ పార్టీలో లేద‌ని అంటున్నారు ఈయ‌న అనుచ‌రులు. టీడీపీలో ఈయ‌న త‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేద‌ని భావిస్తుండ‌డ‌మే కాకుండా, త‌న వార‌సురాలికి కూడా ప్రాధాన్యం ఉండ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ట‌. 

దీనికి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చెబుతున్నారు అశోక్ అనుచ‌రులు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు ఉన్న వేదిక‌పై అశోక్ కుమార్తె అధితి కూర్చోవ‌డంపై సాక్షాత్తూ అధినేతే ఫైర‌య్యార‌ని దీంతో అశోక్ తీవ్రంగా బాధ‌ప‌డ్డార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో జిల్లాలో వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిన సుజ‌య్ కృష్ణ రంగారావుకు ద‌క్కుతున్న ప్రాధాన్యం త‌న‌కు ద‌క్క‌డం లేద‌ని, నియామ‌కాల్లోనూ త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోతోంద‌ని అశోక్ ఫీల‌వుతున్న‌ట్టు స‌మాచారం. 

ఈ రెండు విష‌యాలే కాదు పార్టీ జిల్లా అధ్య‌క్షుడి ఎంపిక‌లో పార్టీ అధిష్టానం అశోక్ మాట‌ను అస్స‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. పార్టీలో రోజు రోజుకు ఆయ‌న మాట‌కు ప్ర‌యారిటీ త‌గ్గిపోతోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కూతురుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు ఇప్పించుకోవాల‌న్న ఆశ తీరుతుందో లేదోన‌ని అశోక్ డౌట్‌తో ఉన్న‌ట్టు జిల్లాలో వినిపిస్తోన్న టాక్‌. ఇక‌, అశోక్ అసంతృప్తిని గుర్తించిన బీజేపీ నేత‌లు ఆయ‌న‌కు గేలం వేసేంందుకు రెడీగా ఉన్నార‌ని అంటున్నారు. 

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అశోక్‌ను పార్టీలో చేర్చుకుని, ఆయ‌నను వాడుకుని ఆయ‌న కుమార్తెకు ఎమ్మెల్యేగా లేక‌పోతే ఎంపీగా సీటిచ్చి.. గెలిపించే బాధ్య‌త‌ను అశోక్‌పై పెట్టాల‌ని బీజేపీ భావిస్తోంద‌ట‌. ఇక‌, అశోక్‌కి మాత్రం ఏదో ఒక రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ పోస్టును రిజ‌ర్వ్ చేయాల‌ని పార్టీ నిర్ణ‌యించింద‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే అశోక్‌తో చ‌ర్చించాల‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నార‌ట‌. ఇదే జ‌రిగితే.. అశోక్ టీడీపీ నుంచి త‌ట్టాబుట్టా స‌ర్దేస్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.