ఏపీలో 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పని అప్పుడే స్టార్ట్ చేసేశాడు. ఇప్పటికే వైఎస్.జగన్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేయాలని చెప్పిన ప్రశాంత్ ప్రస్తుతం వైసీపీకి ఉన్న ప్రజాప్రతినిధుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న వారిలో కొందరికి టిక్కెట్లు ఇవ్వకూడదని కూడా జగన్కు ప్రాధమిక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రశాంత్ ప్రాధమిక నివేదికలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేయాలని జగన్కు చెప్పినట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. తిరుపతి ఎంపీ వరప్రసాద్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డిలకు వచ్చే ఎన్నికల్లో జగన్ టిక్కెట్టు ఇవ్వరని వైసీపీ విశ్వసనీయవర్గాల ద్వారా మ్యాటర్ లీక్ అయ్యి ట్రెండ్ అవుతోంది.
ఇక వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధుల్లో 21 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో అధికార టీడీపీ గూటికి చేరిపోయారు. మిగిలిన ప్రజాప్రతినిధుల్లో పార్టీలోను, నియోకవర్గాల్లోను యాక్టివ్గా ఉండకుండా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న 16 మంది ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేయాలని జగన్కు ప్రశాంత్ సూచించినట్టు వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామందికి తెలియడంతో వాళ్లు ప్రశాంత్ జగన్కు ఇచ్చిన లిస్టులో తమ పేరుందా ? అని ఆరాలు తీసే పనిలో పడ్డారట. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ప్రశాంత్ నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేస్తోన్న జగన్ మరి ఆయన మాట విని తమకు ఎక్కడ టిక్కెట్టు ఇవ్వడో అన్న టెన్షన్ చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉందట. మరి వీరి టెన్షన్ ఇలా ఉంటే ఆ 16 మంది ఎమ్మెల్యేలు ఎవరబ్బా ? అని వైసీపీ వాళ్లు ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు.