నంద్యాల రాజ‌కీయం మ‌ళ్లీ యూట‌ర్న్‌..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం ఏ రోజు ఎలా మ‌లుపులు తిరుగుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ప‌దేళ్ల‌లో చాలా మంది నాయ‌కులు పార్టీలు ఫిరాయించారు. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన భూమానే తీసుకుంటే ఆయ‌న టీడీపీ – ప్ర‌జారాజ్యం – వైసీపీ తిరిగి టీడీపీ ఇలా చాలా పార్టీలు మారారు. గ‌త ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి మంత్రి ప‌ద‌వి హామీతో టీడీపీలోకి జంప్ చేశారు. రెండు నెల‌ల క్రితం ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఆయ‌న‌కు ద‌క్కాల్సిన మంత్రి ప‌ద‌వి ఆయ‌న కుమార్తె, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే అఖిల‌ప్రియ‌కు ద‌క్కింది.

ఇక భూమా హ‌ఠాన్మ‌ర‌ణంతో ఇక్క‌డ త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. తాము గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసినందున నంద్యాల సీటును త‌మ‌కే ఇవ్వాల‌ని శిల్పా బ్ర‌ద‌ర్స్ డిమాండ్ చేస్తున్నారు. కాని ప‌క్షంలో ఈ సీటును ఇత‌రుల‌కు ఇస్తే శిల్పా సోద‌రులు వైసీపీలోకి జంప్ చేయ‌డ‌మో లేదా, ఇండిపెండెంట్‌గా పోటీ చేయ‌డ‌మో చేస్తామ‌ని బాబుకు ఇప్ప‌టికే డైరెక్టుగాను, ఇన్‌డైరెక్టుగాను హెచ్చ‌రిక‌లు పంపేశారు.

కొద్ది రోజుల క్రిత‌మే శిల్పా సోద‌రులు వైసీపీలోకి వెళ్లిపోతార‌ని జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత మంత్రుల మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో వారు చ‌ల్ల‌బ‌డ్డారు. చంద్ర‌బాబు నంద్యాల పంచాయితీ తేల్చ‌లేదు. మ‌రోవైపు ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రేపో మాపో వ‌చ్చేయ‌నుంది. దీంతో చంద్ర‌బాబు భూమా ఫ్యామిలీకే టిక్కెట్టు కేటాయిస్తార‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో శిల్పా సోద‌రులు మ‌ళ్లీ అస‌మ్మ‌తి రాగం అందుకున్నారు.

త‌మ‌కు టిక్కెట్ రాని ప‌క్షంలో వారు వెంట‌నే వైసీపీలోకి వెళ్లిపోయేలా ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక జ‌గ‌న్ సైతం నంద్యాల‌లో శిల్ప సోద‌రులు పార్టీలోకి వ‌స్తార‌ని వెయిట్ చేస్తున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఏదేమైనా నంద్యాల‌లో భూమా వ‌ర్సెస్ శిల్పా సోద‌రులు పోరులో చంద్ర‌బాబు తీవ్రంగా నలిగిపోతున్నారు. వీరిలో ఒక‌రిని వ‌దులుకోక త‌ప్ప‌లా లేదు.