ఏపీ కేబినెట్ విస్తరణ సొంత పార్టీ నేతల్లో ప్రకంపనలు రేపుతోంది. మొత్తం 26 ఖాళీలు పూర్తి కావడంతో ఇక కొత్తగా ఎవ్వరికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ విస్తరణలో కులాల లెక్క తప్పినట్టు రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని సామాజికవర్గాలకే పెద్ద పీఠ వేయగా మరి కొన్ని కీలక కులాలకు అస్సలు ప్రాధాన్యమే లభించలేదు. మైనార్టీలు, ఎస్టీలతో పాటు క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఒక్క మంత్రికి కూడా చోటులేదు. దీంతో ఈ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
కేబినెట్లో కులాల కూర్పు చూస్తే కమ్మ వర్గానికి సీఎం చంద్రబాబుతో కలుపుకుంటే 6 బెర్తులు దక్కాయి. మిగిలిన కులాల్లో 4 కాపులకు, 4 రెడ్లకు ఇచ్చారు. 1 వైశ్య, 1 వెలమ, 8 మంది బీసీలకు, 2 ఎస్సీలకు ఇచ్చారు. ఇక కేబినెట్లో అగ్రవర్ణాల్లో కమ్మలకు, రెడ్లకు, కాపులకు మంచి ప్రాధాన్యమే దక్కింది. బీసీలకు 8 బెర్తులతో బాగా ప్రయారిటీ ఇచ్చిన బాబు అందరికి షాక్ ఇచ్చారు. ఇవన్నీ బాగానే ఉన్నా ఎస్టీ, మైనార్టీ, క్షత్రియ వర్గాలకు అస్సలు చోటు లేకపోవడంతో ఆ వర్గాలన్ని తీవ్ర నిరాశతో ఉన్నాయి.
ఇక క్షత్రియ కోటాలో ఉండి ఎమ్మెల్యే కలువపూడి శివకు వస్తుందని అనుకున్నా ఆయన్నూ పక్కన పెట్టేశారు. దీంతో కులాల సమతుల్యత లెక్క తప్పినట్లయ్యింది.
ఇక కులాల వారీగా మంత్రుల జాబితా ఇలా ఉంది…..
ఓసీ – కమ్మ :
నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి) – నారా లోకేశ్ – ప్రత్తిపాటి పుల్లారావు – దేవినేని ఉమామహేశ్వరరావు -పరిటాల సునీత -కామినేని శ్రీనివాస్
ఓసీ – కాపు :
గంటా శ్రీనివాసరావు – పి.నారాయణ -నిమ్మకాయల చినరాజప్ప – పైడికొండల మాణిక్యాలరావు
ఓసీ – రెడ్డి :
అమర్నాథ్రెడ్డి – భూమా అఖిలప్రియ – సీహెచ్.ఆదినారాయణరెడ్డి -సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
ఓసీ – వైశ్య :
శిద్ధా రాఘవరావు
ఓసీ – వెలమ :
సుజయ్ కృష్ణ రంగారావు
బీసీ :
యనమల రామకృష్ణుడు (యాదవ) – చింతకాయల అయ్యన్నపాత్రుడు (కొప్పు వెలమ) – కింజారపు అచ్చెన్నాయుడు (కొప్పు వెలమ) -పితాని సత్యనారాయణ (శెట్టి బలిజ) – కాలువ శ్రీనివాసులు (బోయ) – కొల్లు రవీంద్ర (మత్స్యకార) – కేఈ.కృష్ణమూర్తి (ఈడిగ) – కిమిడి కళా వెంకట్రావు (తూర్పు కాపు)
ఎస్సీ :
కేఎస్.జవహర్ (మాదిగ) – నక్కా ఆనంద్బాబు (మాల)