బ్రాహ్మ‌ణి ఎంట్రీతో ఆ ఇద్ద‌రు ఎంపీల‌కు టెన్ష‌న్‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మణి ఇద్ద‌రు ఎంపీల‌ను తెగ టెన్ష‌న్ పెడుతున్నారు. ఇటు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌తో చంద్ర‌బాబు..మంత్రుల‌ను టెన్ష‌న్ పెడుతుంటే.. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీల్లో గుబులు పుట్టిస్తున్నారు ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి! ముఖ్యంగా చంద్ర‌బాబు కుటుంబం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేసే వారి జాబితా పెరుగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న త‌న‌యుడు.. ఎమ్మెల్సీగా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు. ఇప్పుడు ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి కూడా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నే లీకులు ఇప్పుడు ఇద్ద‌రు ఎంపీలను టెన్ష‌న్ పెడుతున్నాయి. ఎందుకంటే ఆ ఇద్ద‌రు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక దాని నుంచి బ్రాహ్మ‌ణి ఎంపీగా పోటీచేయ‌బోతున్నార‌ట‌.

ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో.. చంద్ర‌బాబు కోడ‌లు బ్రహ్మణి ఇప్పటికే గేమ్ మొదలు పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. భర్తను రాజకీయంగా హైలెట్ చేసుకోవడానికి బాబుపై బ్రహ్మణి ఒత్తిడి తీసుకొస్తోందని కొన్నాళ్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ తోపోలిక పెట్టుకుని.. భర్తను మంత్రిగా చేసేంత వరకూ బ్రహ్మణి పట్టువదలనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఒత్తిడితో బాబు చేసేది లేక లోకేష్ ను ఎమ్మెల్యేగా నామినేట్ చేసి మంత్రిగా చేస్తున్నాడని సమాచారం.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని బ్రహ్మణి భావిస్తున్నార‌ట‌. అది కూడా ఎంపీగా పోటీ చేయాలని. విజయవాడ అయితే అందుకు తగిన వేదిక అవుతుందని లెక్కలేసిందని, ఈ మేరకు ఆమె మామ బాబుకు అల్టిమేటం జారీ చేసినట్టుగా సమాచారం. తాత ఎన్టీఆర్ సొంత జిల్లా కావడం, అక్కడ సొంత కులం ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో బ్రహ్మణి విజయవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటోందట‌. ఇదే స‌మ‌యంలో గుంటూరు నుంచి కూడా పోటీచేసే అవ‌కాశం లేక‌పోలేద‌ట‌. రెండు జిల్లాల్లో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం పార్టీకి అండగా ఉంటుంద‌ని గ‌ట్టిగా భావిస్తున్నార‌ట‌.

చంద్రబాబు కూడా చేసేది లేక ఆమెను కాదనే అవకాశం లేక ఓకే చెప్పాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ లీకులు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానిని, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ను టెన్ష‌న్ పెట్టేలా చేస్తున్నాయట‌. ఆమె పోటీ చేస్తే ఎవ‌రో ఒక‌రికి ఎర్త్ త‌ప్ప‌దు. మ‌రి ఆమె ఎంట్రీ ఎలా ఉన్నా.. ఇప్పుడు ఎంపీల‌కు మాత్రం నిద్ర క‌రువువుతోంది.