ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరు చెబితే టీడీపీ నేతలు సర్రున ఒంటికాలిపై లేస్తారు. ఇక మంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు! కానీ ఏపీ కేబినెట్లోని ఇద్దరు మంత్రులు జగన్తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారా? నిత్యం జగన్తో టచ్లో ఉంటూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారా? ఇక వారు రేపో మాపో టీడీపీని వీడి జగన్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాచారమే వినిపిస్తోంది.
ముఖ్యంగా ప్రస్తుతం టీడీపీపై ప్రజల్లో క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. గత ఎన్నికల్లో మోడీ ఎఫెక్ట్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, విభజన, సీనియారిటీ వంటి అంశాలు చంద్రబాబుకు అండగా నిలిచాయి. అయితే ప్రస్తుతం టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల సమయానికి జగన్కు క్రమంగా బలం పెరుగుతుందని వీరు భావిస్తున్నారట. అందుకే జగన్ చెంత చేరితే ఇక తమకు ఢోకా ఉండదనే వ్యూహరచనలో ఉన్నారట. ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మంత్రులు రావెల, గంటా శ్రీనివాసరావుకు ఉద్వాసన పలకవచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. దీంతో వీరిద్దరూ జగన్ చెంతకు చేరాలని భావిస్తున్నారట.
మంత్రి వర్గ విస్తరణలో ఈసారి భారీ మార్పులే జరగబోతున్నాయి. పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడంతో.. ఇప్పటికే మంత్రుల్లో గుబులు మొదలైంది. ముఖ్యంగా రావెల కిషోర్ బాబు, కిమిడి మృణాళిని, పల్లె రఘునాధరెడ్డి, పీతల సుజాతల పేర్లు ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్నాయి. అయితే పార్టీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, అదే సమయంలో తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొందరు మంత్రులు ఇప్పటికే జగన్తో టచ్లో ఉంటున్నారట. ముఖ్యంగా బాబు సీక్రెట్లను జగన్కు అప్పగించారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.