త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగబోతు న్నాయి! ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఎలా ఉండబోతోందనే అంశం చర్చనీయాంశంగా మారింది, హోదాపై పార్లమెంటులోనూ తమ గళం వినిపించేందుకు ఆ పార్టీ ఎంపీలు సిద్ధమవుతున్నారు! అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని చెబుతున్నారు. ఈ సమయంలో ఎంపీలతో రాజీనామా చేయించి జగన్ తప్పటడుగు వేస్తారా? అప్పుడు జరిగే ఉప ఎన్నికలు వైసీపీకి కలిసిరాకపోగా టీడీపీ-బీజేపీకే లబ్ధి చేకూరుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది,
ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా తెగిస్తామని వైసీపీ తెగేసి చెబుతోంది. ఇక హోదా సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ అధినేత జగన్ స్పష్టం చేస్తున్నారు. ఈ సమావేశాల్లోనే తాడో పేడో తేల్చుకుంటామని ఆ ఎంపీలు తెగేసి చెబుతున్నారు. జగన్తో భేటీ అనంతరం, వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామా చేస్తామంటున్నారు. బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయడం, ఆ తర్వాత రాజీనామాస్త్రాలు సంధించడంపై వైసీపీ గతంలోనే ప్రకటించిన అనంతరం.. బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
గతంలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీలు హోదా కోసం పోరాడుతున్నట్లు హంగామా చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీడీపీ నేతలంతా, ప్రత్యేక హోదా దండగ.. అనేస్తున్నారు. ఒకపక్క హోదా ఇవ్వం అని బీజేపీ తెగేసి చెబుతోంది! ఇప్పుడు వైసీపీ హోదా గళం విన్పిస్తే, దానికి ఎంతవరకూ మద్దతు లభిస్తుందనేది చర్చనీయాంశం! దీంతో వారి రాజీనామాలను లైట్ తీసుకునే అవకాశాలే ఎక్కువ! ఆ తర్వాత ఉప ఎన్నికలు జరిగితే రాజకీయ సమీకరణాలు మారతాయనడంలో సందేహం లేదు. ఆ ఎన్నికలు టీడీపీ-బీజేపీకి లాభం చేకూరుస్తాయని అంచనా!
విశాఖలో ఏపీ యువత ప్రత్యేక హోదా కోసం గళం విప్పేందుకు ప్రయత్నిస్తే బాబు సర్కార్ అణిచివేసింది. ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా సద్దుమణిగిపోయింది. పోరాడతానన్న పవన్కళ్యాణ్ కామ్ అయిపోయాడు. కాంగ్రెస్ కూడా చేతులెత్తేసింది. వైసీపీ కూడా హడావిడి చేసినా ఎవరికీ తెలియకుండా చేయడంలో బాబు విజయం సాధించారు. మరి ఇప్పుడు రాజీనామా చేసినా ఏమాత్రం ఫలితం ఉండకపోగా వైసీపీకే నష్టమనేది అంచనా!!