ఏపీ అధికార పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబులపై వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా మాటలతో విరుచుకుపడింది. గతానికి భిన్నంగా ఇద్దరు నేతలను క లిపి కుమ్మేసింది. చౌకబారు విమర్శలు పక్కనపెట్టి.. నిఖార్సైన వ్యాఖ్యలతో చించొదిలి పెట్టింది. ఇంతకీ రోజా ఏమందనేగా సందేహం.. అక్కడికే వచ్చేద్దాం. ఏపీ అధికార పార్టీ అంటే ఒంటి కాలిపై లేచే రోజా.. తాజాగా తన మాటలకు మరింత మషాళా అద్ది.. సంచలనం సృష్టించింది. చంద్రబాబుకు లోకేష్ అంటే భయం పట్టుకుందని, అందుకే మంత్రి వర్గంలోకి లోకేష్కి ఎంట్రీ ఇవ్వడం లేదని విమర్శించింది వైకాపా ఫైర్ బ్రాండ్.
వాస్తవానికి లోకేష్కి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ గడిచిన ఏడాదిన్నర కిందట పార్టీలో చర్చకు కూడా వచ్చింది. లోకేష్ని మంత్రిని చేస్తామంటే.. మా సీట్లు ఖాళీ చేసి ఆయనకు సమర్పిస్తామంటూ.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకువచ్చారు. అయితే, ఏం జరిగిందో ఏమో ఎప్పటికప్పుడు ఏపీ మంత్రి వర్గ విస్తరణ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఇదే విషయంపై కౌంటర్లించిన రోజా. యూపీ రాజకీయాలు చూసి ఏపీలో చంద్రబాబుకు బీపీ వచ్చిందని, అక్కడ అఖిలేష్లాగానే ఇక్కడ లోకేష్ కూడా తనను ఎక్కడ అధికారంలో నుంచి దింపేస్తారనే భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.
ఆ భయంతోనే లోకేష్ను మంత్రిని చేయడానికి చంద్రబాబు వెనుకాడుతున్నారన్నారు. సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు లేవన్న చంద్రబాబు… పులివెందులకు ఇస్తామంటే జనం నమ్ముతారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు నిధులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అన్యాయం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. మొత్తానికి లోకేష్కి మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించుకునే వారికి రోజా సమాధానం మంచి ఆన్సర్ అవుతుందేమో చూడాలి.