ప్రధాని మోడీకి పరీక్షా కాలం మొదలైందా? ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగడంతో ఇది మొదలవబోతోందా?అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు! ప్రాంతీయ పార్టీల హవాను తగ్గించి.. అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా రెపరెపలాడాలని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మోడీ-అమిత్ షా బృందం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే! కానీ అవన్నీ విఫలమైపోయాయి! ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్లో ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరేయాలని మోడీ అండ్ కో ఎలాంటి ప్రణాళికలు వస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2014 ఎన్నికల్లో మోడీ ప్రభంజనంతో లోక్సభలో తిరుగులేని మెజారిటీ సాధించింది బీజేపీ! కానీ రాజ్యసభలో మాత్రం స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో కీలకమైన బిల్లులను ఆమోదించలేకపోతోంది. ఈ మూడేళ్లలో ఢిల్లీ, బీహార్, బెంగాల్,తమిళనాడు రాష్ట్రాల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని మోడీ-షా ద్వయం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అక్కడి ప్రాంతీయ పార్టీల హవా ముందు వారి ఎత్తులన్నీ చిత్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు మోడీకి పరీక్షేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
80 లోక్సభ స్థానాలు గల ఉత్తరప్రదేశ్.. బీజేపీకి ఎంతో కీలకం. ప్రస్తుతం అధికార సమాజ్వాదీ పార్టీలో జరుగుతున్న ముసలం తమకు లాభిస్తుందని బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అసహనం, గోరక్షణ హత్యలు, విశ్వ విద్యాలయ వివాదాలు వంటివన్నీ యూపీ కేంద్రంగానే జరిగాయి. కనుక అమిత్షా ఎంత కష్ఠపడినా బీజేపీ విజయం సాధించడం సవాలే. ప్రభుత్వ వైఫల్యాలు అరోపణలు మాదకద్రవ్యాల సమస్య,సిక్కు మతతత్వం వంటి సమస్యలు పంజాబ్లో సవాలుగా మారాయి. దీనికి తోడు ఆప్ కూడా పోటీలో ప్రధానంగా ఉంది.
ఇక గోవాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే! ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిళ రంగంలోకి దిగడంతో పోటీ తీవ్రంగా ఉంది. బీహార్ తరహాలో యూపీలోనూ దెబ్బతిని, పంజాబ్ను కోల్పోయేట్టయితే వచ్చేసారి దాని జాతీయ అవకాశాలకు భారీ గండిపడినట్టే. ముఖ్యంగా ప్రధాని నోట్ల రద్దు నిర్ణయం కూడా ఈసారి కీలకంగా మారే అవకాశాలున్నాయి.