జ‌న‌సేన‌లోకి మాజీ సీఎం కిర‌ణ్ రెడ్డి

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆఖ‌రి సీఎం, తాను హైద‌రాబాదీనే అయినా.. స‌మైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నానంటూ సీఎం సీటులో కూర్చునే పెద్ద ఎత్తున పెను సంచ‌ల‌నం సృష్టించిన న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి గుర్తున్నారా? రాష్ట్రం విడిపోతే నీళ్ల‌కోసం పెద్ద ఎత్తున యుద్ధాలు చేసుకోవాల్సి వ‌స్తుందంటూ.. త‌న స‌మైక్య వాద‌న‌కు బ‌లం చేకూర్చే కామెంట్లు చేసిన క్రికెట్ ల‌వ‌ర్ కిర‌ణ్ రెడ్డి గుర్తున్నారా? దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన ఈ కాంగ్రెస్ మాజీ నేత‌, సొంత కుంప‌టి పెట్టుకుని విఫ‌ల‌మైన పార్టీ అధినేత‌గా పేరొందిన కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చారు. గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా ఖాళీగా ఉన్న కిర‌ణ్‌.. ఇప్పుడు మ‌ళ్లీ ఉపాధి వెతుక్కుంటున్నార‌ట‌!

రాష్ట్ర విభ‌జన నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి విడిపోయి.. సొంత కుంప‌టి పెట్టుకున్నా అది కూడా ఎలాంటి ఫ‌లితాన్నీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇంటికే ప‌రిమితం అయిపోయిన కిర‌ణ్ రెడ్డికి ఇప్పుడు మ‌న‌సు మ‌ళ్లీ.. పాలిటిక్స్ వైపు మ‌ళ్లింద‌ట‌! దీంతో ఆయ‌న ఏదో ఒక పార్టీలో చేరాల‌ని, రానున్న 2019 ఎన్నిక‌ల్లో క్రియాశీలంగా మారాల‌ని భావిస్తున్నార‌ట‌! అయితే, ఏ పార్టీలో చేరాల‌నే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు టాక్‌. సీఎం సీటు క‌ట్ట‌బెట్టిన కాంగ్రెస్‌తో క‌టీఫ్ చేసుకున్న నేప‌థ్యంలో తిరిగి మ‌ళ్లీ ఆపార్టీలోకి వెళ్లే యోచ‌న‌లో మాత్రం ఆయ‌న‌లేడు. ఇక‌, బ‌ద్ధ‌శ‌త్రువు చంద్ర‌బాబు చెంత‌కు అస‌లే వెళ్ల‌లేరు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌ల త‌న యాంగిల్‌ని వైఎస్ త‌న‌యుడు పెట్టిన వైకాపా వైపు మ‌ళ్లించుకున్నార‌ట‌. జ‌గ‌న్ అయితే త‌న‌క‌న్నా చిన్న‌వాడు కాబ‌ట్టి.. త‌న మాట‌కు విలువ ఇస్తాడ‌ని, అదేవిధంగా త‌న టీంలో గ‌తంలో ప‌నిచేసిన బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వంటి వారు ఎలాగూ అక్క‌డే ఉన్నారుకాబ‌ట్టి.. త‌న‌కూ పొలిటిక‌ల్‌గా బాగుంటుంద‌ని అనుకున్నార‌ట‌. కానీ.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ క‌న్నా జ‌న‌సేనాని ప‌వ‌న్ దూకు డు మీదుండ‌డం, ఆయ‌న పార్టీకి ప్ర‌జ‌ల్లో సైలెంట్ ఫాలొయింగ్ క‌నిపిస్తుండ‌డంతో కిర‌ణ్ రెడ్డి.. ప‌వ‌న్ చెంత‌కు చేరాల‌ని డిసైడ్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌వ‌న్ పార్టీలో అయితే, త‌నకు చేతినిండా ప‌నికూడా ల‌భిస్తుంద‌ని కిర‌ణ్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది. పార్టీని ఇంకా సంస్థాగ‌తంగా డెవ‌ల‌ప్ చేయ‌లేదు కాబ‌ట్టి.. ఆ ఛాన్స్‌ని తాను ఉప‌యోగించుకుని పేరు సంపాదించొచ్చ‌ని కిర‌ణ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇక‌, అదేస‌మ‌యంలో కొంద‌రు మిత్రులు జాతీయ పార్టీ బీజేపీలో చేరితే బాగుంటుంద‌ని సూచించినా.. తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి అంత సీన్ లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతున్న నేప‌థ్యంలో దానిలోకి వెళ్లి చేసేది ఏముంటుంద‌ని కిర‌ణ్ భావిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే జ‌న‌సేన‌లోకి కిర‌ణ్ ఎంట్రీ ఖాయంగా క‌నిపిస్తోంది.