అధికార పక్షం `ఆపరేషన్ ఆకర్ష్`తో కలిగిన నష్టాన్ని `ఆపరేషన్ రికవరీ` పేరిట పూడ్చుకుంటోంది వైసీపీ! వివిధ జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా ముగ్గురు మాజీ మంత్రులు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరంతా టీడీపీ బలంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం!! టీడీపీ కంచుకోటను కూల్చేందుకు జగన్ పెద్ద ప్లాన్తోనే రెడీ అవుతున్నట్టు సమాచారం.
2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఉభయగోదావరి జిల్లాలు కీలకంగా మారిన విషయం తెలిసిందే! పశ్చిమగోదావరిలో 15 స్థానాలకు 15 గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఈసారి టీడీపీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని జగన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు ఇవి ఫలించాయని తెలుస్తోంది. బీజేపీ నాయకుడు, గతంలో ఏలూరు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, మాజీ కేంద్రమంత్రి, సినీనటుడు కృష్ణం రాజు, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన వట్టి వసంత్ కుమార్ ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారట.
వీరి చేరికతో అటు రాజకీయంగానూ, ఇటు సామాజికవర్గాల పరంగానూ వైసీపీకి లాభమని జగన్ భావిస్తున్నారట. కాపు సామాజికవర్గ ఓట్లు కీలకంగా మారిన తరుణంలో వసంత్కుమార్ చేరికతో ఆ సామాజిక వర్గ ఓట్లు వైసీపీకి పడతాయనే యోచనలో ఉన్నారు. అలాగే కృష్ణంరాజుకు నరసాపురం లోక్సభ నియోజకవర్గ బాధ్యతలు, కావూరికి ఏలూరు లోక్సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారట. అలాగే వసంత్కుమార్కు ఉంగుటూరు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. మరి జగన్ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి!!