సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం సాధారణమే! అయితే ఇప్పుడు కడప జిల్లాలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు స్థానికంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు అనే సూక్తిని నిజం చేసేలా కనిపిస్తోంది. వైఎస్ను, ఆయన తనయుడు జగన్ను శత్రువులా భావించే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఫొటో వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో కనిపించడం కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తోంది.
కడప గడపలో రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. తన కుటుంబానికి కంచుకోట అయిన కడపపై సీఎం చంద్రబాబు దృష్టిసారిస్తుండటంతో ఆ జిల్లాకు చెందిన కీలక నేతలపై జగన్ దృష్టిసారించారు. తన శత్రువులైన వారిని కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2011లో కడప ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ కుటుంబంపై, జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు డీఎల్ రవీంద్రారెడ్డి. అలాగే జగన్పై సవాలు విసిరి జగన్పైనే ఎంపీగా పోటీచేసి ఓడిపోయాడు! ఇప్పుడు ఆయన ఫొటో వైసీపీ నాయకలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై కనిపిస్తుండటంతో ఆయన వైసీపీలో వైసీపీలో చేరిపోతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
డీఎల్ ఫొటోలతో కూడిన వైసీపీ బ్యానర్లు మైదుకూరు నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. ఖాజీపేటలోనూ, మైదుకూరు మండలంలోని వనిపెంట, లెక్కలవారిపల్లె తదితర గ్రామల్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వివేకానందరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి ఫొటోలతో నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
కాగా త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఇప్పటికే పలుమార్లు డీఎల్ను కలసి తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరగా డీఎల్ కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం. వైఎస్ వివేక గెలుపునకు తన వంతుగా కృషి చేసే పనిలో డీఎల్ బిజీ అయ్యారట. ఈసందర్భంగానే వైసీపీ, డీఎల్ అభిమానులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారట. డీఎల్ వైసీపీ ఎంట్రీ ఇస్తే ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి ఎర్త్ తప్పదన్న గుసగుసలు కూడా కడప పాలిటిక్స్లో వినిపిస్తున్నాయి.