చంద్ర‌బాబు ఈ సారి దొరికిపోతాడా..!

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని చెప్పి మాట‌మార్చిన బీజేపీపై, దానికి మ‌ద్ద‌తు తెలిపిన టీడీపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రాకుండా సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టివ‌ర‌కూ మంత్రాంగం న‌డిపారు, కానీ త‌మిళులు త‌మ సంప్ర‌దాయ క్రీడ జ‌ల్లికట్టును నిర్వ‌హించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్య‌మించిన తీరు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇప్పుడు దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఏపీ నాయ‌కులంతా హోదా కోసం ఉద్య‌మించాల‌నే డిమాండ్ పెరుగుతోంది. అయితే పొరుగున ఉన్న వారు చేసిన ప‌ని మ‌న‌మెందుకు చెయ్య‌లేం అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ మెద‌లుతోంది. ఒక‌వేళ హోదా కోసం ఏపీ యువ‌త‌ ఉద్య‌మిస్తే ఈసారి చంద్ర‌బాబు దొరికిపోతారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది,

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతగా కోరుకుంటున్నా ప్రత్యేక హౌదా నిరాకరణపై ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల ఆగ్రహం ఆవేదన చల్లారడం లేదు. జల్లికట్టు ఉద్యమం ఇక్కడ జాతికట్టుగా మారడం టిడిపికి మింగుడు పడని పరిణామం. జల్లికట్టుతో అందరూ ఒక్కతాటిపై నిలవడమే ప్రధానాంశంగా వచ్చింది. జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మద్దతు తెల్పడం, కాంగ్రెస్‌ ఎంపి కెవిపి రామచంద్రరావు లేఖ రాయడం, మీడియాలోనూ ఈ విధమైన చర్చలు గతం కన్నా మించి ఇప్పుడు ప్రత్యేక హౌదా సమస్యను రంగం మీదకు తెచ్చాయి.

హౌదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ వంటి వారు ఈ విషయంలో సినిమా నటులు కూడా ముందుకు రావాలని కోరడంతో సాయిధరమ్‌ తేజ్‌,శివబాలాజీ,సందీప్‌ కిషన్‌, వరుణ్‌ తేజ్‌ వంటి యువనటులు కూడా మద్దతు ప్రకటించారు. విశాఖ పట్టణం ఆర్కే బీచ్‌లో యువ సమీకరణపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మామూలుగా విడిగా ఆందోళన చేసే వైసీపీ అధ్య‌క్షుడు జగన్‌ కూడా ఎవరు చేసినా మంచిదేనన్నారు. ఇప్పుడు వాస్తవానికి తెలుగు దేశం ప్రభుత్వం ఈ నినాదాన్ని కాదనడమంటే వ్యతిరేకత కొని తెచ్చుకోవడమేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

గతంలో కాంగ్రెస్‌చేయలేదంటూనే వారు చేసిన మేరకు కూడా అమలు చేయని మోడీ సర్కారును రాష్ట్ర ప్రభుత్వం సమర్థించినట్టు కనిపిస్తే ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. ప్రత్యేకహౌదాను ప్రత్యేక ప్యాకేజీ ప్రహసనం కింద దిగజార్జి అది కూడా ఇంతవరకూ తేల్చని పైసా రాల్చని కేంద్రాన్ని నిలదీయడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు! మ‌రి ఇప్ప‌టివ‌ర‌కూ హోదాపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని చంద్ర‌బాబు.. ఇక‌నైనా కేంద్రంతో పోరాడతారా లేదో చూడాలి