మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 4 వేల పైచిలుకు థియేటర్లలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే క్రమంలో ఓవర్సీస్లో సైతం కేవలం ప్రీమియర్ షోలతోనే బాహుబలి రికార్డులకు దగ్గరైంది. బాహుబలి ప్రీమియర్లతో 1.3 మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొడితే ఖైదీ కూడా ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు చిరంజీవి అభిమానులు చేసిన హడావిడి, రచ్చ అంతా ఇంతా కాదు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్లో ఎక్కడికక్కడ ఖైదీ సినిమా రిలీజ్ను పెద్ద పండుగలా జరుపుకున్నారు. అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద కేక్ కట్ చేసి, ఫ్లెక్సీలు కట్టి, థియేటర్లను బ్యానర్లతో అలంకరించి కొత్త పెళ్లి కూతుళ్లలా ముస్తాబు చేశారు.
అయితే కృష్ణా జిల్లా గుడివాడలో మాత్రం ఓ షాకింగ్ సంఘటన జరిగింది. నందమూరి యంగ్టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ ఖైదీ నెంబర్ 150 రిలీజ్ సందర్భంగా నానా హంగామా చేశారు. వీరు ఖైదీ రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో బ్యానర్లు కట్టారు. ఈ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటోతో పాటు చిరు-చెర్రీ-ఖైదీ డైరెక్టర్ వినాయక్ల ఫొటోలు పెట్టారు. ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో చాలా మంది డైరెక్టర్ వినాయక్ను కూడా బాగా అభిమానిస్తారు.
ఎన్టీఆర్-వినయ్ కాంబోలో మూడు సినిమాలు వచ్చి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వినాయక్ను అభిమానించే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ బ్యానర్లు ఏర్పాటు చేసినట్టు సమాచారం. మొత్తానికి ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు పెద్ద సంచలనమయ్యాయి.