జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని తన కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. పవర్ – సర్దార్ గబ్బర్సింగ్ లాంటి సినిమాల డైరెక్టర్ బాబి దర్శకత్వంలో కొత్త సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్రామ్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు జై లవ కుశ అనే టైటిల్ పరిశీలిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్టీఆర్ మూడు పాత్రలకు తగ్గట్టుగానే జై – లవ – కుశ అనే టైటిల్ పెడుతున్నారట.
ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ సినిమాలో ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు కావాలట. వీరిని సెలెక్ట్ చేయడమే పెద్ద సమస్యగా మారిందట చిత్ర బృందానికి. ముగ్గురు టాప్ హీరోయిన్ల డేట్లు ఒకేసారి కావాలంటే చాలా కష్టం. ముందుగా రకుల్ప్రీత్సింగ్ – శృతీహాసన్ డేట్ల కోసం ట్రై చేశారు. వారు ఖాళీగా లేరు.
దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఐదుగురు హీరోయిన్లను ఎంపిక చేశారట. వీరిలో ముగ్గురి పేర్లను ఫైనలైజ్ చేస్తారని సమాచారం. ప్రస్తుతానికి ఎంపిక చేసిన ఆ ఐదుగురు హీరోయిన్లు కాజల్, కీర్తీ సురేశ్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, రాశీ ఖన్నా. వీరిలో వరుసగా 25 రోజులు డేట్లు ఇవ్వగలిగే ముగ్గురు హీరోయిన్లకు ఈ సినిమాలో ఛాన్స్ ఉంటుందని సమాచారం.
మరి ఈ పంచ ముద్దుగుమ్మల్లో ఎన్టీఆర్తో రొమాన్స్ చేసే ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరో చూడాలి. ఏకధాటిగా జరిగే షెడ్యూల్లో సినిమాను ఫినిష్ చేసి ఆగస్టు 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.