కాంగ్రెస్ అధినేత్రి త్వరలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? వయోభారం, అనారోగ్య కారణాలతో ఆమె రాజకీయాలకు దూరం కాబోతున్నారా? ఇక తనయుడు రాహుల్ గాంధీకి బదులు కుమార్తెను ఆమె స్థానంలో రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తనయుడికి బదులు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కుమార్తెకు అప్పగించాలని సోనియాగాంధీ ప్రణాళికలు రచిస్తున్నారట. అంతేగాక పార్టీ సమూల ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తున్నారట.
నాయకత్వ మార్పుపై కాంగ్రెస్లో కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ ఇక రాజకీయాలకు గుడ్బై చెప్పాలనే యోచనలో ఉన్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ లాంటి పటిష్టమైన నాయకత్వం పార్టీకి తయారుచేయాలన్నది సోనియా వ్యూహమట. రాహుల్ కంటే సోనియా కుమార్తె ప్రియాంక గాంధీని కాంగ్రెస్ అధినేత్రిగా చేయాలనే డిమాండ్ పెరుగుతుండటంతో ఆమెను ప్రమోట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని టాక్. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో మార్పులు జరగబోతున్నాయని సమాచారం.
త్వరలో కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ శకం మొదలుకానుందట. ఇక నుంచి ప్రతి అంశంపైనా ఆమె నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. 2019లోపే ప్రియాంక రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేస్తుందట. సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నుంచి యువరాణి పోటీ చేస్తారని సమాచారం, అంతేకాకుండా పార్టీ పగ్గాలు కూడా ప్రియాంక చేతికి వెళ్లనున్నాయని చెబుతున్నారు. ఈ విషయంలో రాహుల్- ప్రియాంక మధ్య ఓ అండర్ స్టాండింగ్ కూడా జరిగిపోయిందని టాక్. ప్రియాంకను అధికారికంగా పార్టీ అధినేత్రిగా ప్రకటించకపోయినా ఆస్థాయి హోదా ఇస్తారట.
ఉత్తర భారతంలో రాహుల్ గాంధీ.. దక్షిణాది బాధ్యతలు ప్రియాంకకు ఇస్తారని టాక్. ఇక పార్టీలో సీనియర్లను కూడా పక్కకు తప్పిస్తారట. పార్టీ వ్యవస్థ మొత్తం ఇక గాంధీ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోనుందట. సోనియా గాంధీ కూడా ఇలా అయితే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారట. అందుకే తన కూతురు, కొడుకు లకు బాధ్యతలిచ్చేసి రిటైర్ అయిపోవాలని నిర్ణయం తీసుకున్నారట.