తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మృతి తర్వాత అక్కడ రాజకీయం రోజుకో రంగు మారుతోంది. తెర మీద కనిపించే వార్తలకు.. తెర వెనుక జరిగే పనులకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. ముందుగా పన్నీర్ సెల్వం ఆఘమేఘాల మీద సీఎం అయ్యారు. తర్వాత జయ నెచ్చెలి శశికళ క్రమక్రమంగా పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సాధిస్తున్నారు. ఆమె సీఎం అయ్యే ప్లాన్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ రాజకీయం మోడీ ఎఫెక్ట్తో మరో యూ టర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. తమిళనాడు అధికారపక్ష నేతలకు అత్యంత సన్నిహితుడైన శేఖర్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలు భారీ ప్లాన్ లో భాగంగానే సాగాయన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం సీఎం పన్నీర్ సెల్వం తన కుర్చీని కాపాడుకునే క్రమంలోనే మోడీతో కలిసి ఈ కొత్త ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
శశికళ గత వారం రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఆమె దూకుడుకు బ్రేకులు వేసే క్రమంలోనే సెల్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. శేఖర్రెడ్డి ఇంట్లో సోదాలతో లభ్యమైన పత్రాలను ఆధారంగా చేసుకుని తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావుతో సహా..ఏపీలోని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ మరిది బద్రీ నారాయణ (ఆయన సీఎస్ వియ్యంకుడు) ఇంట్లోనూ సోదాలు నిర్వహించటం గమనార్హం.
శశికళ సీఎం పదవి మీద మక్కువను బయటపెట్టాక ఈ దాడులు జరుగుతోన్న తీరు చాలా సందేహాలకు తావిస్తోంది. పైగా సీఎం పన్నీర్ సెల్వం మోడీని మీట్ అయ్యి వచ్చాక ఈ దాడులు జరుగుతుండడంతో మోడీ ప్లాన్తో శశికళను తొక్కే కార్యక్రమం అమలు జరుగుతోన్నట్టు తెలుస్తోంది. సీఎం పదవిపై కన్నేసి శశికళకు చుక్కలు చూపించడంతో పాటు ఆమె పాత్రను బాగా తగ్గించేయాలనే మోడీ అండ్ కేంద్రం ఈ నయా ప్లాన్ వేసినట్టు తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఫ్యూచర్లో ఆమెకు కేసుల మరక కూడా అంటిచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు. జయలలిత ఉన్నన్ని రోజులు మోడీ తమిళనాడు పాలిటిక్స్లో వేలుపెట్టే సాహసం కూడా చేయలేదు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రధానమంత్రి అయ్యేందుకు మోడీ వేస్తోన్న ఎత్తుల్లో భాగంగానే ఆయన పన్నీరు సెల్వాన్ని ఇప్పటి నుంచే లైన్లో పెట్టుకుంటూ..ఆయనకు తన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారని తాజా సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది.