రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఎన్నకలు సమీపిస్తుంటే.. పాలిటిక్స్లో వచ్చే మార్పులే డిఫరెంట్గా ఉంటాయి. విషయంలోకి వెళ్తే.. 2014లో కొంచెం మెజారిటీ తేడాతో అధికార పీఠాన్ని కోల్పోయిన వైకాపా అధినేత జగన్.. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికలకు దాదాపు రెండున్నరేళ్లు సమయం ఉన్నాకూడా ఇప్పటి నుంచే గెలుపు మంత్రి పఠిస్తూ.. గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టారు. తన పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా అధికార టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు.
ఈ క్రమంలోనే ఆయన తన స్టైల్లో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని జిల్లా కృష్ణాలో మంచి పట్టున్న టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వంశీని తన పార్టీలోకి తీసుకోవాలని, ఫలితంగా జిల్లాలో పట్టు సాధించాలని జగన్ ప్లాన్ చేసినట్టు టాక్ నడుస్తోంది. యువ ఎమ్మెల్యే అయిన వంశీకి గన్నవరంలో మంచి పలుకుబడి, ప్రచారం కూడా ఉంది. వంశీని అభిమానించేవారు ఈ నియోజకవర్గంలో కోకొల్లలు. అదేసమయంలో టీడీపీకి ఈ నియోజకవర్గం కంచుకోట. ఈ నేపథ్యంలోనే టీడీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలంటే కృష్ణా జిల్లాని మించిన జిల్లా లేదని జగన్ భావించాడని, ఈ క్రమంలోనే వంశీకి వల విసిరాడనే ప్రచారం జరుగుతోంది.
వంశీకి, జగన్కి పరిచయం ఇప్పటిది కాదు. ఉమ్మడి ఏపీ సయమంలోనే విజయవాడకు వెళ్లిన జగన్ని విమానాశ్రయంలోనే వాటేసుకుని మాట్లాడిన నేతగా అప్పట్లో వంశీ తీవ్ర ప్రచారంలోకి వచ్చారు. అంతేకాదు… జగన్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న జిల్లాకు చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, పేర్నినాని తదితరులతో కూడా వంశీకి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ విషయం తెలిసిన జగన్.. వంశీకి వీరి ద్వారానే వల విసిరి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. వంశీ రాకతో జిల్లాలో అన్ని వైపులా వైకాపా బలం పెరుగుతుందని, ఫలితంగా టీడీపీకి దెబ్బకొట్టచ్చని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, నియోజకవర్గంలో తనను అందరూ టీడీపీ నేతగానే గుర్తించడం, వాస్తవానికి టీడీపీ నేతగానే తాను కూడా పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడం వంటి నేపథ్యంలో వంశీ.. జగన్ ప్రపోజల్కి ఒకే చేస్తాడా? తన స్నేహితులైన కొడాలి, వంగవీటి, పేర్నిల ఒత్తిడికి తలొగ్గి.. వైకాపాలో చేరతారతారా? అనే విషయంపై గన్నవరం సహా జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే!!