వ‌ర్మ ” వంగ‌వీటి ” కి విజ‌య‌వాడ‌లో థియేట‌ర్లు నిల్‌

వాస్తవ కథల ఆధారంగా సినిమాలు తెరెకెక్కించడంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఎవ్వ‌రూ సాటిరారు. వ‌ర్మ రియ‌లిస్టిక్ సినిమాల ప‌రంప‌ర‌లో ఆయ‌న నుంచి వ‌స్తోన్న మ‌రో సంచ‌ల‌నాత్మ‌క చిత్రం వంగ‌వీటి. 1980, 90లలో విజ‌య‌వాడ ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లో పేరుమోసిన వ్య‌క్తులుగా ఉన్న వంగ‌వీటి, దేవినేని కుటుంబాల చ‌రిత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన వంగ‌వీటి మూవీ విడుద‌ల‌కు ముందే ఎన్నో సంచ‌నాలు క్రియేట్ చేసింది.

వ‌ర్మ త‌న‌దైన స్టైల్లోనే వంగ‌వీటికి రిలీజ్‌కు ముందే కావాల్సిన‌న్ని కాంట‌వ‌ర్సీలు క్రియేట్ చేసి ఓ క్రేజ్ తెచ్చేశాడు. వంగ‌వీటి సినిమా ఈ నెల 23న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయని వంగవీటి రంగా కుమారుడు, వైసీపీ నాయ‌కుడు వంగ‌వీటి రాధా హైకోర్టును ఆశ్ర‌యించ‌డం… దానిపై కోర్టు తీర్పు కూడా ఇచ్చింది.

ఇక ఈ సినిమా గురించి వ‌ర్మ ఇప్ప‌టికే రాధాతో పాటు రంగా భార్య ర‌త్న‌కుమారితో సైతం మీట్ అయ్యాడు. ఆ రోజు చ‌ర్చ‌లు ఫ‌లించ‌లేద‌ని కూడా వ‌ర్మ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే వంగ‌వీటి రిలీజ్‌కు మ‌రో నాలుగు రోజులే టైం ఉంది. విజ‌య‌వాడ‌లో మాత్రం వంగ‌వీటి రిలీజ్‌పై స‌స్పెన్స్ నెల‌కొంది. విజయవాడలో ఈ సినిమా విడుదలను ఆపేందుకు రాధా అనుచ‌రులు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

వంగవీటి సినిమాను ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్లకు ఇప్ప‌టికే వార్నింగ్‌లు వెళుతున్నాయ‌న్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ అవాంత‌రాల మ‌ధ్య వంగ‌వీటి ఎలా థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందో చూడాలి.