నయీం నన్ను బెదిరించాడు. నా నియోజకవర్గంలోకి కూడా అడుగు పెట్టొద్దని శాసించాడు! దీంతో నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయా- ఇది అధికార టీఆర్ ఎస్కి చెందిన ఓ నేత మాట. నిజమే! నయీంతో అనేక మంది పెద్ద వాళ్లకి సంబంధాలున్నాయని మాకూ సమాచారం అందింది. అయితే, వాళ్లెవరనేది విచారణలోనే తేలుతుంది. కొంత మంది పోలీసులు కూడా నయీంతో అంటకాగారు. నా హయాంలో వాళ్లని సస్పెండ్ కూడా చేశాను- ఇది పోలీస్ శాఖ మాజీ బాస్ ప్రకటన! ఈ రెండింటిని బట్టి.. ఏం తెలుస్తోందంటే.. టెన్త్ చదివే విద్యార్థి కూడా సునాయాసంగా చెప్పేయగలడు. నయీంకి రాజకీయ నేతలకు, నయీంకి పోలీసులకు మధ్య ఏదో ఉందని!!
నయీం ఇప్పుడు మనమధ్య లేడు! పోలీసులు కొన్నాళ్ల క్రితం ఎన్కౌంటర్ చేశారు. కానీ, అతనితో అంటకాగిన వాళ్లు, అతనిని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగిన వాళ్లు, అతని ద్వారా దందాలు చేయించిన వాళ్లు, అతని అండ చూసుకుని సెటిల్ మెంట్లు చేసిన వాళ్లు మనమధ్య చాలా మందే ఉన్నారు. ఈ విషయం నయీం డైరీలో స్పష్టంగా ఉంది. దీని ఆధారంగానే నయీంను ఎన్కౌంటర్ చేసిన కొత్తలో కేసీఆర్ ప్రభుత్వం.. ఎవరినీ ఒదిలి పెట్టేది లేదని పెద్ద పెద్ద డైలాగులు దంచి కొట్టింది. అందరూ నిజమే అనుకున్నారు. నయీంతో అంటకాగిన వాళ్లు.. హడలి..,. ఒడిలి.. మీడియా ముందు మోకరిల్లారు కూడా!!
కానీ, ఇంతలో ఇప్పుడు.. ప్రభుత్వం యూటర్న్!! నయీంతో నయీంకు అన్ని పార్టీల నేతలతో సంబంధాలున్నా యన్న ఆరోపణ నిజం కాదని, ఇతర రాష్ట్రాల నక్సల్స్ – దావూద్ ఇబ్రహీంతో నయీంకు సంబంధాలు లేవని కూడా స్పష్టం చేసింది. నయీం వ్యవహారంలో 175 కేసులు నమోదు చేసి 16 ఛార్జిషీట్లు దాఖలు చేశామని సాక్షాత్తూ హైకోర్టులో తెలిపింది. దీంతో కేసులో వాడి వేడి పూర్తిగా చల్లారిందనే విషయం స్పష్టమైపోయింది. నిజానికి ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ.. సీపీఐ సీనియర్ నేత నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టుకు పైవిధంగా కేసు వివరాలను సమర్పించింది. దీనిని బట్టి. తెలంగాణ ప్రభుత్వం నయీం కేసును పూర్తిగా నీరుకార్చేందుకు పూనుకుందని తెలిసిపోతోంది. ఇదే విషయంలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. కేసీఆర్ ప్రభుత్వం.. కేసును నీరుగారుస్తోందని విమర్శించారు. ఈ కేసులో ఎక్కువ మంది టీఆర్ ఎస్ నేతలే ఉన్నారని అందుకే దీనిని మూసేసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. ఎవరెన్ని ఆరోపించినా.. ప్రభుత్వంలో చిత్త శుద్ధి దారి తప్పిందని మాత్రం స్పష్టమైంది. సో.. నయీం ఎన్కౌంటర్ జరిగిన కొన్నాళ్లకు ఇలా.. నయీం కేసులను కూడా ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు! అని అంటున్నారు విశ్లేషకులు!!