వైకాపా అధినేత జగన్కి షాక్ మీద షాక్ తగులుతోందా? వైకాపాలో జంపింగ్లకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదా? అంటే ఔననే సమాధానమే వస్తోంది! వైకాపాలో కీలకంగా ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యే జంపింగ్ బాట పడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి వైకాపా నుంచి అధికార టీడీపీలోకి జరిగిన జంపింగ్లు అందరికీ తెలిసిందే. క్యూ కట్టుకుని మరీ వైకాపా నేతలు టీడీపీలోకి వెళ్లిపోయారు. దాదాపు నాలుగు నెలల కిందట జరిగిన ఈ వరుస జంపింగ్లు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి.
ఇక, ఇప్పుడు పరిస్తితి సర్దు మణిగిందని అందరూ అనుకుంటున్నారు. జగన్ కూడా ఇక వైకాపా నుంచి వెళ్లే వారు ఎవరూ ఉండరని, ఇక ఉన్నవాళ్లంతా గ్యారెంటీగా తన వాళ్లేనని ఇటీవల తన అనుచరులతో కూడా అన్నట్టు సమాచారం. అంతేకాదు, తన పార్టీ నుంచి వెళ్లేవారు లేకపోవడం మాట అటుంచి.. వేరే పార్టీల నుంచి వచ్చేవారికి ఆయన ఆహ్వానం పలకడంలో బిజీ అయిపోయారు. అయితే, ఇంతలో వైకాపా నుంచి ఓ మహిళా ఎమ్మెల్యే జంపింగ్కి రెడీ అయిపోయారు అనే వార్త ఇప్పుడు ఆ పార్టీ అధినేత సహా అందరిలోనూ షాక్ పుట్టించిందట!
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి 2014లో గెలుపొందిన వైకాపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన.. మొన్నామధ్య జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కీలక రోల్ పోషించారు. రోజా లేని లోటును తీరుస్తున్నారు అని వైకాపా నేతలు అనుకున్నారు. ఇంతలో ఆమెకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందని, దీంతో ఆమె చంద్రబాబు చెంతకు చేరిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాబు నిన్న ఆదివారం కల్పనకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. దీంతో ఆమె సైకిలెక్కడం ఖాయమైందని సమాచారం. అయితే, ఇక్కడే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే వైకాపా నుంచి టీడీపీలోకి వెళ్లినవారికి ఎలాంటి పదవులు, గుర్తింపు కూడా దక్కలేదు. అంతేకాదు, జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి వంటి వారికి ఇచ్చిన హామీలను బాబు ఇంకా నెరవేర్చలేదని టాక్. మరి ఇలాంటి క్రమంలో కల్పన టీడీపీలోకి ఏం చూసుకుని జంప్ చేస్తున్నారని విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా.. సొంత లాభం లేకుండా జంపింగ్కు ఆస్కారమే ఉండదు కదా! మరి కల్పన ఏం ఆశించారో.. మొత్తానికి త్వరలోనే ఈ జంపింగ్ జానమ్మ విషయం అటో ఇటో తేలిపోతుంది!