మోడీకి అద్వానీ షాక్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బీజేపీ కురువృద్ధుడు ఎల్‌.కె. అద్వానీ నుంచి పెద్ద షాక్ త‌గిలింది! వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీ పేరు తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్పుడు కూడా గోద్రా ఘ‌ట‌న నేప‌థ్యంలో అద్వానీ.. గుజ‌రాత్ సీఎంగా ఉన్న మోడీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయినా.. పార్టీ అద్వానీ స‌ల‌హాను ప‌క్క‌న‌పెట్టి మోడీని ప్ర‌ధానిని చేసింది. ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ అద్వానీ అదే విధ‌మైన వ్య‌తిరేకత వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. మోడీ తాజాగా తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంపై అద్వానీ అగ్గిమీద గుగ్గిలంగా మండుతున్నార‌ట‌. మ‌రి ఎందుకు అలా మండిప‌డుతున్నారో చూద్దాం..

పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం మోడీ ప్ర‌క‌టించిన త‌ర్వాత దేశంలో పెద్ద ఎత్తున చిల్ల‌ర‌కు కొర‌త ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో కూలీల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు అంద‌రూ త‌మ వ‌ద్ద ఉన్న నోట్ల‌ను మార్చుకునేందుకు చిల్ల‌ర తీసుకునేందుకు పెద్ద ఎత్తున బ్యాంకుల వ‌ద్ద క్యూ క‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తొలి రెండు మూడు రోజులు బ్లాక్ మ‌నీ క‌ట్ట‌డికి మోడీ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించిన వాళ్లే.. ఇప్పుడు మాకెందుకీ తిప్ప‌లు.. అంటూ మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. అదేస‌మ‌యంలో లైన్ల‌లో నిల‌బ‌డ‌లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విష‌యాల‌పై దేశ‌వ్యాప్తంగా అన్ని విప‌క్షాలూ ఒక్క‌తాటిపైకి వ‌చ్చి మోడీకి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నిల‌దీయాల‌ని నిర్ణ‌యించాయి.

ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున విప‌క్షాలు దాడికి దిగితే ఎదురు దాడి చేసేందుకు మోడీ త‌న ప‌రివారాన్ని సిద్ధం చేయాల‌ని భావించారు. దీంతో నిన్న ప్రారంభ‌మైన పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా బీజేపీ ఎంపీల‌ను పేరుపేరునా ప‌ల‌క‌రించి.. త‌నకు అండ‌గా నిల‌వాల‌నికోరార‌ట‌. ఈ క్ర‌మంలో అద్వానీ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌.. మోడీ.. త‌న‌కు అండ‌గా ఉండాల‌ని, విప‌క్షాల‌పై ఎదురు దాడి చేయాల‌ని కోరార‌ట‌. అయితే, అద్వానీకి దీనికి రివ‌ర్స్‌గా ఇంత పెద్ద నిర్ణ‌యం తీసుకునేట‌ప్పుడు సీనియ‌ర్లుగా మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించాల‌ని తెలీదా? అని ప్ర‌శ్నించార‌ట‌. అంతేకాకుండా ఈ నోట్ల దెబ్బ‌తో బీజేపీకి భ‌విష్య‌త్తులో ఏం జ‌రిగినా బాధ్య‌త నీదే అన్నట్టు మాట్లాడార‌ట‌. దీంతో ఒక్క‌సారిగా మోడీ షాక్‌కు గుర‌య్యార‌ట‌. మ‌రి అద్వానీనా మ‌జాకా?!!