దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా రికార్డులకు అంతూ పంతూ లేదు. ఆ సినిమా ఏకంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి…ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ సరికొత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
ఇక బాహుబలితో తెలుగు సినిమా టేకింగ్ను అంతర్జాతీయ స్థాయికి దర్శకుడు రాజమౌళి తీసుకువెళ్లాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక ఈ నెల నుంచే బాహుబలి 2 హంగామా ప్రారంభం కానుంది. వచ్చే యేడాది సమ్మర్లో ఏప్రిల్ 28న బాహుబలి -2 ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాహుబలి 2 ప్రమోషన్స్ను ఈ నెల నుంచే రాజమౌళి బృందం స్టార్ట్ చేయనుంది.
బాహుబలి రిలీజ్ అయ్యాక ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తే బాహుబలి-2 రిలీజ్కు ముందే ప్రి రిలీజ్ బిజినెస్ నుంచే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే తమిళ హక్కుల్ని ఊహించని మొత్తానికి అమ్మేసిన నిర్మాతలు… తాజాగా ఓవర్సీస్ రైట్స్ ను కూడా అంతే ధరకు అమ్మినట్టు తెలుస్తోంది.
ఇన్నర్ ట్రేడ్ టాక్ ప్రకారం బాహుబలి-2 ఓవర్సీస్ రైట్స్ రూ.45 కోట్లకు అమ్ముడైపోయాయట. బాహుబలి 2 హిందీ, తెలుగు, తమిళ్, మళయాల హక్కులను ఓల్సేల్గా ఈ రేట్కు అమ్మేశారట. గ్రేట్ ఇండియా ఫిలింస్ సంస్థ ఈ నాలుగు భాషల హక్కులను భారీ రేటు చెల్లించి సొంతం చేసుకుందని తెలుస్తోంది.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ డీల్ కేవలం అమెరికాకు మాత్రమే. అమెరికా కాకుండా మిగతా ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఓపెన్ లోనే ఉంది. లండన్, దుబాయ్, షార్జా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో కూడా బాహుబలి సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ దేశాల్లో బాహుబలి-2 రైట్స్కు మరింత డిమాండ్ పెరగనుంది.