తెలుగు ప్రజల హృదయాల్లో నందమూరి, నారా వంశాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు వంశాల హీరోల మధ్య ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. కేరీర్లో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న ఈ రెండు వంశాలకు చెందిన హీరోలు తమ సినిమాలను ఒకేసారి బాక్సాఫీస్ మీదకు వదులుతున్నారు. ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి వస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద నందమూరి, నారా సినీ అభిమానులను పెద్ద కన్ఫ్యూజన్ తప్పదన్న టాక్ కూడా వినిపిస్తోంది.
కెరీర్ లో హిట్ కోసం ప్రయత్నిస్తున్న ఆ ఇద్దరు హీరోలు… బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతారనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. ఆ ఇద్దరు హీరోలు పరస్పరం పోటీ పడితే ఫ్యాన్స్కు కన్ఫ్యూజన్ తప్పదని సినీ జనం భావిస్తున్నారు. గతేడాది పటాస్తో కేరీర్లోనే తిరుగులేని హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్రామ్. తర్వాత షేర్ నిరాశపరిచినా ఇప్పుడు తన తాజా సినిమా ఇజంతో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతోంది. అయితే ఇజం సినిమాకు నారా వారి అబ్బాయి రోహిత్ పోటీ ఇవ్వబోతుండటం ఆసక్తిగా మారింది. రీసెంట్గా జ్యో అచ్యుతానంద సినిమాతో హిట్ను తన ఖాతాలో వేసుకున్న నారా రోహిత్ తన కొత్త సినిమా శంకర ను కూడా అప్పుడే వదులుతున్నాడు.
ఈ యేడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల మందుకు వచ్చిన నారా రోహిత్ శంకర సినిమాతో ఈ నెల 21న ఐదో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ ఇద్దరు తమ సినిమాలకు డేట్లు ఫిక్స్ చేసేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద నందమూరి వర్సెస్ నారా హీరోల పోరు షురూ అవ్వడమే మిగిలి ఉంది. మరి ఈ పోటీలో నందమూరి హీరో పై చేయి సాధిస్తాడో ? లేదా నారా హీరోది గెలుపు అవుతుందో చూడాలి.