టాలీవుడ్లో కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న బన్నీ-లింగుస్వామి సినిమా ఎట్టకేలకు ఓకే అయ్యింది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. చాలా రోజులుగా లింగుస్వామి సినిమాపై నాన్చుతూ వస్తోన్న బన్నీ ఇప్పుడు హఠాత్తుగా ఈ సినిమాకు ఓకే చెప్పడం వెనక పెద్ద కథే నడిచిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
గురువారం చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవం పెద్ద అట్టహాసంగా జరిగింది. హీరోలు సూర్య, కార్తీ ఫ్యామిలీకి చెందిన జ్ఞానవేల్ రాజా ఈ కార్యక్రమం జరిపించారు. ఇక బన్నీకి ఈ సినిమా కథ నచ్చినా ఓకే చెప్పకపోవడంతో వెంటనే లింగుస్వామి ఎన్టీఆర్కు కథ చెప్పి ఒప్పించారు. ఎన్టీఆర్ నిర్మాతతో మాట్లాడాలని చెప్పడంతో ఈ ప్రాజెక్టును ఎన్టీఆర్తో చేద్దామని ఫిక్స్ అయిన లింగుస్వామి నిర్మాతల వేటలో ఉన్నాడు.
ఇంతలో ఏమైందో వెంటనే లింగుస్వామికి బన్నీ నుంచి ఫోన్ వచ్చేసింది. మనమే ఈ ప్రాజెక్టు చేద్దామని బన్నీ చెప్పడంతో వెంటనే లింగుస్వామి ఎన్టీఆర్ను పక్కన పెట్టేసి మళ్లీ బన్నీతోనే డిసైడ్ అయిపోయాడు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే జ్ఞానవేల్ రాజాకు, అరవింద్కు ఎప్పట్నుంచో వ్యాపార సంబంధాలు ఉన్నాయి.
బన్నీకి ఇప్పటికే మల్లూవుడ్లో మంచి మార్కెట్ ఉంది. ఇక ఈ సినిమాతో తమిళ మార్కెట్ సైతం ఏర్పడేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇటు తెలుగులో సూర్య, కార్తీలకు అరవింద్ సపోర్ట్ ఉంటుంది, అటు తమిళంలో బన్నీకి జ్ఞానవేల్ అండ ఉంటుంది. ఇలా సౌత్ ఇండియా సినీ మార్కెట్పై కన్నేసిన బన్నీ లింగుస్వామి ప్రాజెక్టుకు ఓకే చెప్పాడని సమాచారం.