కాకినాడ‌లో ఆ రెండు పార్టీల‌కు ఓటేస్తే మురిగిన‌ట్టేనా..!

అవును! ఇప్పుడు కాకినాడ ఓట‌ర్లు ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా ప్రారంభ‌మైన కాకినాడ మునిసిప‌ల్ కార్పొరేషన్ ఎన్నిక ఉద‌యం ఏడు గంటల నుంచి ప్ర‌శాంతంగా సాగిపోతోంది. ఓట‌ర్లు ఇక్క‌డ కూడా తండోప‌తండాలుగా పోలింగ్ బూత్‌ల‌కు క్యూ క‌డుతున్నారు. మ‌హిళ‌లు ఇళ్ల‌లో ప‌నులను వాయిదా వేసుకుని మ‌రీ ఓటేసేందుకు పోటెత్తుతున్నారు. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ పార్టీకి ఓటేయాలి? అనేది కాకుండా.. ఏ పార్టీకి ఓటేస్తే.. మురిగిపోతుంది? త‌మ ఓటు విలువ లేకుండా పోతుంది? అని పెద్ద ఎత్తున మ‌హిళ‌లు, పురుషులు చ‌ర్చించుకుంటున్నారు.

రాష్ట్రాన్ని విభ‌జించార‌ని, హైద‌రాబాద్‌ను లేకుండా చేశార‌ని, తెలుగు వాళ్ల మ‌ధ్య చిచ్చు పెట్టార‌ని కాంగ్రెస్‌పై ఉన్న కోపం తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికీ చ‌ల్లార‌లేదు. దీనికి నంద్యాల రిజ‌ల్ట్ అద్దం ప‌డుతోంది. ఇక‌, కాకినాడ‌లోనూ జ‌నాలు ఇదే టాపిక్‌పై చ‌ర్చించుకుంటున్నారు. రాష్ట్రాన్ని విభ‌జించి, ఏపీని అనాధ‌ను చేసిన కాంగ్రెస్‌కు ఓటేయ‌డం వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం ? అని చ‌ర్చించుకుంటున్నారు. ఈ పార్టీకి ఓటేయ‌డం వ‌ల్ల మురిగిపోతుందే త‌ప్ప‌.. లాభం ఏమిటి? అని మ‌హిళ‌లు అనుకుంటున్న‌ట్టు స‌మాచారం.

ఇక‌, ఇదేస‌మ‌యంలో బీజేపీపైనా జ‌నాలు పెద‌వి విరుస్తున్నారు. కాంగ్రెస్ లాంటిదే బీజేపీ అని వారు వెక్కిరిస్తున్నారు. రాష్ట్రాన్ని విభ‌జించి కాంగ్రెస్ కొరివి పెడితే.. బీజేపీ ప్ర‌త్యేక హోదాకు దిక్కులేకుండా చేసి.. ప్యాకేజీతో స‌రిపెట్టింద‌నే కోపం కాకినాడ ఎన్నిక‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతోంది. హోదా ఇవ్వ‌ని కార‌ణంగా బీజేపీకి, రాష్ట్రాన్ని విడ‌గొట్టింద‌న్న కార‌ణంగా కాంగ్రెస్‌కు ఇక్క‌డి ప్ర‌జ‌లు బై బై చెబుతున్నారు.

ఇక‌, మిగిలిన రెండు పార్టీలు టీడీపీ, వైసీపీలు, స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే ఓటేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా రెండు ప్ర‌ధాన జాతీయ పార్టీల‌పై జ‌నాలు ఇలా ఫిక్స‌యి పోవ‌డం దారుణం అంటున్నారు విశ్లేష‌కులు. ఇప్ప‌టికైనా ఆ యా పార్టీల నేత‌లు తెలుగు వాళ్ల ఆగ్ర‌హం చ‌ల్లార్చేందుకు ప్ర‌య‌త్నించాలి.