తెలంగాణలో బీజేపీకి ఐదుగురంటే ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీలోకి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్లెవరు చేరలేదు. అయితే ఈ విషయంలో తాము ముందుగా మేల్కొని ఉంటే… టీఆర్ఎస్ చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే చేరి ఉండేవాళ్లని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు చాలా కామనైపోయాయని… కానీ ఈ విషయంలో తాము చాలా ఆలస్యంగా మేల్కొన్నామని టీ బీజేపీ నేతలు భావిస్తున్నారు.
కేసీఆర్ కంటే ముందుగానే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని ఉంటే… ఆ తరువాత పరిస్థితి వేరుగా ఉండేదని కొందరు నాయకులు అన్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని పలువురు నేతలు అమిత్ షా దగ్గర కూడా ప్రస్తావించారట. అయితే ఫిరాయింపుల అంశాన్ని పక్కనపెట్టి… సొంతంగా పార్టీని ఎలా బలపరుచుకోవాలనే దానిపై నేతలు దృష్టి పెట్టాలని అమిత్ షా వారికి సూచించినట్టు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ఎక్కువగా ఆరెస్సెస్ ను మాత్రమే నమ్ముకుంటోందని… అలా కాకుండా ఇక్కడ ఉండే కొందరు బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని పలువురు నాయకులు కేంద్ర నాయకత్వానికి సూచించారు. అయితే పార్టీలో చేరికలను ఎన్నికల ముందు చూసుకుందామని చెప్పడంతో… టీ బీజేపీ నేతలు కూడా డీలా పడిపోయారు. ఇప్పటి నుంచి నాయకులను చేర్చుకుంటేనే వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ను బలంగా ఎదుర్కొంటామని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నట్టు సమాచారం.