దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలని, దీనికి తమిళనాడు నుంచే ప్రారంభించాలని ఆశ పెట్టుకున్నబీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత.. ఎలాగైనా తమిళనాడుపై పట్టు సాధించాలని చూస్తున్న కాషాయ దళానికి షాక్ ఎదురైంది. ఆర్ కే నగర్లో ఎలాగైనా బలం లేకపోయినా, సూపర్ స్టార్ ఇమేజ్తో నెట్టుకురావాలని చూస్తున్న బీజేపీ నేతల ఆశలు గల్లంతయ్యాయి! చివరికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా బీజేపీకి షాక్ ఇచ్చాడు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వనని స్పష్టంచేశాడు. దీంతో ఇక తమిళనాట బలపడాలనుకున్న బీజేపీ కల.. ఇక కలగానే మిగిలిపోనుంది.
తనపై ఆశలు పెట్టుకున్నరాజకీయ పార్టీలకు దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ మరోమారు షాకిచ్చారు. తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని ట్విటర్ వేదికగా కుండబద్దలు కొట్టారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్లో… ఉపఎన్నిక రసవత్తరంగా మారిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఏప్రిల్ 12న జరిగే ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గంగై అమరన్.. ఇటీవల రజనీకాంత్తో భేటీ అయిన సంగతి తెలిసిందే.
అన్నాడీఎంకే నుంచి శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు, డీఎంకే, దీప పేరవై, బీజేపీ, డీఎండీకే, సీపీఎం, నామ్ తమిళర్ కచ్చి తదితర పార్టీలు పోటీకి దిగాయి. అయితే గంగై అమరన్..రజినీకాంత్ను కలవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడైన గంగై అమరన్… తాను రజనీకాంత్ ఆహ్వానం మేరకే ఆయన ఇంటికి వెళ్లినట్టు ప్రకటించారు.
దీంతో బీజేపీ వైపు రజనీ మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ట్విటర్లో స్పందిస్తూ… ‘‘వచ్చే ఎన్నికల్లో ఎవరికీ నేను మద్దతు ఇవ్వడం లేదు’’ అని ప్రకటించారు. దీంతో ఆయన మద్దతుపై పెట్టుకున్న బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి!