పదవీ కాలం ముగిసింది…. అయినా అధికారంలో ఎలా…?

పదవి వ్యామోహం ఏ స్థాయిలో ఉంటుందో… ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదవి కోసం పార్టీలు మారే వాళ్లు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నిన్నటి వరకు తిట్టిన నోటీతోనే… పదవి ఇచ్చిన పార్టీ నేతను ఆకాశానికి ఎత్తేస్తుంటారు కూడా. ఇక పదవిలో ఉన్న వారు అయితే… నిబంధనలను కూడా గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా సరే… పదవి కోసం కావాల్సిన అడ్డదార్లు అన్నీ తొక్కేస్తున్నారు కూడా. పార్టీ అధికారంలో లేకపోయినా సరే… తనదే పెత్తనం అంటున్నారు ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకటలక్ష్మి. వాస్తవానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే… అప్పటి వరకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి… తన పదవికి రాజీనామా చేసేశారు. దీంతో వైసీపీలో తొలి నుంచి కీలకనేతగా గుర్తింపు తెచ్చుకున్న వాసిరెడ్డి పద్మను ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు జగన్. 2014లో షర్మిల పాదయాత్రలో, ఆ తర్వాత జగన్ పాదయాత్రలో చివరి వరకు పాల్గొన్న వాసిరెడ్డి పద్మకు జగన్ సముచిత స్థానమే ఇచ్చాడని పార్టీ నేతలు సైతం కితాబిచ్చారు. ఐదేళ్ల పాటు ఛైర్‌పర్సన్ స్థానంలో కొనసాగిన వాసిరెడ్డి పద్మ… సరిగ్గా ఎన్నికల ముందు జగ్గయ్యపేట టికెట్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. అలాగే మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పోస్టుకు రాజీనామా కూడా చేశారు.

వాసిరెడ్డి పద్మ స్థానంలో సభ్యురాలు గజ్జల వెంకటలక్ష్మిని ఇంఛార్జ్‌గా నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచే ఆమె ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీటీడీ బోర్డు సహా ఇతర కార్పొరేషన్ల ఛైర్మన్లు రాజీనామాలు చేసినప్పటికీ… గజ్జల వెంకటలక్ష్మి మాత్రం ససేమిరా అనేశారు. పైగా కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా కూడా ఆర్డర్లు పాస్ చేశారు. తాజాగా గజ్జల వెంకటలక్ష్మి అధికార దుర్వినియోగం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళా ఛైర్‌పర్సన్‌గా గజ్జల పదవీ కాలం గత నెలలోనే ముగిసింది. అయినా సరే… ఇంకా ఆమె ఛైర్‌పర్సన్‌ హోదాలోనే కొనసాగుతుండటంతో పాటు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు.

వాస్తవానికి ఏపీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం ఛైర్‌పర్సన్‌ లేదా సభ్యులు నియామకం అయిన తర్వాత గరిష్టంగా ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఒకవేళ ఏదైనా కారణంతో ఛైర్‌పర్సన్‌ లేదా సభ్యులు రాజీనామా చేసినా లేక తొలగింపునకు గురైతే… వారి స్థానంలో తిరిగి ప్రభుత్వం నియమించిన ఛైర్‌పర్సన్‌ లేదా సభ్యులు… ఎవరి స్థానంలో అయితే బాధ్యతలు నిర్వహిస్తున్నారో… వారికి మిగిలిన కాలపరిమితితో మాత్రమే కొనసాగే అవకాశం ఉంటుంది. వాసిరెడ్డి పద్మను 2019 ఆగస్టు 26న ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. అంటే ఛైర్‌పర్సన్‌ పదవీ కాలం 2024 ఆగస్టు 25తో ముగిసింది. అయితే వాసిరెడ్డి పద్మ మాత్రం ఈ ఏడాది మార్చి 4వ తేదీన రాజీనామా చేయగా… గజ్జల వెంకటలక్ష్మిని ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ మార్చి 15న వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. గజ్జల వెంకటలక్ష్మి పదవీకాలం కూడా గత నెల 8వ తేదీనే ముగిసింది. అయినా సరే… నేటికీ ఆమె పేరుతోనే అధికారిక ఉత్తర్వులు వెలువడుతున్నాయి. గడువు ముగిసినప్పటికీ… ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ హోదాలోనే గజ్జల వెంకటలక్ష్మి ఇంకా కొనసాగుతున్నారు. ఇదేమిటని ఇప్పుడు కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. అటు అధికారులు కూడా గజ్జల వెంకటలక్ష్మికి ఇప్పటికీ ప్రోటోకాల్ మర్యాదలు పాటిస్తున్నారు. దీంతో అటు గజ్జల వెంకటలక్ష్మిపైన, ఇటు అధికారులపైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ కాలం ముగిసినా సరే.. ఇలా పెత్తనం చేయడం ఏమిటని నిలదీస్తున్నారు.