మలై ఆపిల్.. ఈ పండు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. కిడ్నీ రాళ్ల సమస్యతో ఇబ్బంది పడే వాళ్లకు ఇది మెడిసిన్గా పని చేస్తుందని వివరించారు. అయితే కొలన్ క్యాన్సర్ కు కూడా ఈ పండు చెక్ పెడుతుందట. ఆయుర్వేద ఔషధాల్లో కూడా దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడో హిమాలయాల్లో ఒక సీజన్లో మాత్రమే ఈ కాయలు దొరుకుతాయి.
అయితే ఇప్పుడు ఈ అరుదైన చెట్టు తెలంగాణలో ఓ ఆయుర్వేద వైద్యురాలు ఇంటి పెరట్లో పెట్టి మరి దానిని సంరక్షించింది. ప్రస్తుతం ఆ చెట్టు మంచి కాపు కాస్తుంది. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ అనుకుంటున్నార ఖమ్మం జిల్లా సత్తుపల్లి. ఈ గ్రామంలో ఆయుర్వేద వైద్యురాలు కొనకళ్ళ సుధా ఇంటి పెరటిలో ఈ అరుదైన చెట్టు పెరిగి మలై ఆపిల్ సమృద్ధిగా కాస్తున్నాయి.
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ పండు క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు.. కిడ్నీ స్టోన్స్ సమస్యలు సులువుగా తగ్గిస్తుందని వివరించారు సుధా. అంతే కాదు. చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి కూడా ఈ పండ్లు చాలా సహకరిస్తాయి. ఎక్కువగా శీతాకాలం మాత్రమే పెరిగే ఈ మొక్క.. దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే సత్తుపల్లి ప్రాంతంలో పెరగడం, మంచి కాపు కాయడం నిజంగా విశేషం అనే చెప్పాలి. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.