టాలీవుడ్లో నిన్నటి తరంలో ఎన్టీఆర్-ఏఎన్నార్-సూపర్స్టార్ కృష్ణ-శోభన్బాబు-కృష్ణంరాజు తర్వాత మల్టీస్టారర్ సినిమాలు లేవు. చాలా రోజుల తర్వాత విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో ఒక్కడు మాత్రమే మహేష్బాబు, పవన్కళ్యాణ్, రామ్ వంటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడు. వెంకటేష్ తర్వాత మరే అగ్రహీరో మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు.
అయితే ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఆ సినిమాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోనుండడం విశేషం. ఈ ఇద్దరు తండ్రి కొడుకులు కావడం మరో షాకింగ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి, చిరు తనయుడు రాంచరణ్ కాంబోలో ఓ మల్టీస్టారర్ మూవీ పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది.
చిరు తాజా చిత్రం ఖైదీ నెంబర్ 150 ఇచ్చిన జోష్తో ఈ తండ్రి, కొడుకులు ఆ మల్టీస్టారర్కు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చరణ్ మూవీలో చిరు, చిరు మూవీలో చరణ్ తళుక్కుమన్నారు. వీరు అలా తళుక్కుమన్నందుకే స్క్రీన్ షేక్ అయిపోయింది. అలాంటిది వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తే థియేటర్లు ఎలా దద్దరిల్లుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ మల్టీస్టారర్ కోసం మంచి రీమేక్ కథలపై దృష్టి పెట్టారట. అలాగే ఒకరిద్దరు సీనియర్ స్టోరీ రైటర్లకు సైతం తమ కోసం ఓ మంచి స్టోరీ రెడీ చేయాలని చిరు సూచించాడట. ఇక ఈ సినిమాను కూడా కొణిదెల ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరు తనయుడు రాంచరణే నిర్మించనున్నాడు. మరి ఈ తండ్రి కొడుకులు కలిసి స్టెప్పులు వేస్తే మెగా అభిమానుల రచ్చ మామూలుగా ఉండదు. వచ్చే యేడాది ఈ క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని సమాచారం.