మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… అంటూ కన్యాశుల్యంలో నాటకంలో గిరీశం చెప్పిన డైలాగు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. నిజమే… ఏపీలో అధికారంలోకి వస్తే చాలు అనుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా లేఖ ఇచ్చారు. దీంతో రాష్ట్ర విభజన జరిగిపోయింది. పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ కేంద్రం హామీలు ఇచ్చినా… వాటిని అమలు జరిపించుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. కేంద్రంలో భాగంగా ఉన్నప్పటికీ.. ప్యాకేజీ వస్తే చాలని అంగీకరించారు. ఆ తర్వాత నాటి విపక్షం వైసీపీ డిమాండ్ చేయడంతో.. ఇరకాటంలో పడిన చంద్రబాబు తప్పని పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకుని… మోదీ సర్కార్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే తప్ప హోదా మాత్రం సాధించలేకపోయారు.
అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు. బయటున్న టీడీపీ నేతలంతా.. మా సార్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.. చంద్రబాబుపై పెట్టినవన్నీ అక్రమ కేసులంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. రెండు రోజుల పాటు బంద్, రాస్తారోకో అంటూ హల్చల్ చేసిన తెలుగు తమ్ముళ్లు… ప్రస్తుతం రిలే నిరాహార దీక్షలతో సరిపెడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు మద్దతుగా పలు చోట్ల ఐటీ ఉద్యోగులు ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఐటీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. జైలులో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా ర్యాలీ చేస్తున్నట్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తెలంగాణ – ఏపీ సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ర్యాలీని అడ్డుకున్నారు. ప్రతి కారును క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడి నుంచి.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ఆరా తీశారు. దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తినప్పటికీ… టీడీపీ నేతలకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు.
గరికపాడు చెక్ పోస్టు సమీపంలో చెకింగ్ జరుగుతున్నప్పటికీ… సమీపంలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, విజయవాడ నియోజకవర్గాల నేతల్లో కనీసం ఒక్కరు కూడా అటు వైపు తొంగి చూడలేదు. ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జులు, మాజీ మంత్రులుి, మాజీ ఎమ్మెల్యేలు అయితే చెక్ పోస్టు వైపు వెళ్లేందుకు కూడా సాహసించలేదు. అటు వెళితే… పోలీసులు కేసులు పెడతారేమో అనే భయంతో… ఇంటికే పరిమితం అయ్యారు తప్ప… చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు చేపట్టిన ర్యాలీకి మద్దతు తెలిపేందుకు… పోలీసుల చెకింగ్ను అడ్డుకునేందుకు కనీసం ప్రయత్నించలేదు. దీంతో మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్ అంటూ ఇప్పుడు సొంత పార్టీ నేతలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.