టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మథుడు నాగార్జున అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్ తో స్టార్ అయ్యాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి విభిన్న పాత్రలను పోషిస్తూ నటుడిగా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాలతో ప్రేక్షకుల భక్తిసాగరంలో ముంచాడు.
ఆరు పదుల వయసులో కూడా హీరోగా, నిర్మాతగా, హోస్ట్ గా మరియు వ్యాపారవేత్తగా దూసుకుపోతున్న నాగార్జున పుట్టినరోజు నేడు. దీంతో సినీ, రాజకీయ ప్రముకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, సినీ ప్రియులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ ను తెలుపుతున్నారు. మరోవైపు నాగార్జునకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
అయితే టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకు దక్కని ఓ అదృష్టం నాగార్జునకు సొంతం అయింది. తెలుగులో ఎంతో మంది హీరోలు తమ తండ్రితో లేదా కొడుకులతో లేదా భార్యతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ, ఒకేసారి తండ్రి, కొడుకులు మరియు భార్యతో నటించిన ఏకైక తెలుగు హీరో నాగార్జున మాత్రమే. ఈ అరుదైన అదృష్టం ఆయనకు మాత్రమే దక్కింది. అక్కినేని ఫ్యామిలీ మొత్తం భాగమైన సినిమా `మనం`. ఇందులో నాగార్జున, నాగచైతన్య, నాగేశ్వర రావు ప్రధాన పాత్రలను పోషించగా.. అఖిల్ మరియు అమల కూడా ఈ మూవీలో భాగం అయ్యారు. 2014లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.