విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ గా కంటే విలన్ గానే ఎక్కువ సక్సెస్ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా వరలక్ష్మికి క్యూ కడుతున్నాయి. హీరోయిన్లు కూడా తనముందు సరిపోరు అనేంతలా వరలక్ష్మి దూసుకుపోతోంది.
సౌత్ లో దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే సౌత్ లో భారీ డిమాండ్ సంపాదించుకున్న వరలక్ష్మి ఓ తెలుగు డైరెక్టర్ కు మోస్ట్ వాంటెడ్ గా మారింది. ఆమె లేనితే ఆయన ఏ సినిమా చేయడం లేదు. ఇంతకీ వరలక్ష్మి వెంటపడుతున్న ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. గోపీచంద్ మలినేని. వరలక్ష్మికి డిమాండ్ పెరిగేలా చేయడంలో గోపీచంద్ పాత్ర కూడా కీలకమే. ఈయన తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ `క్రాక్`లో జయమ్మ పాత్ర ద్వారా వరలక్ష్మి టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకుంది.
క్రాక్ అనంతరం గోపీచంద్ బాలయ్యతో `వీర సింహా రెడ్డి` చేశాడు. ఇందులోనూ వరలక్ష్మి చేత కీలక పాత్రను చేయించాడు గోపీచంద్. ఈ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు గోపీచంద్ మళ్లీ రవితేజతో ఓ సినిమా చేయబోతున్నాడు. వీరి కాంబో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. తన లక్కీ ఛార్మ్ అయిన వరలక్ష్మి కోసం గోపీచంద్ తన నెక్స్ట్ మూవీలోనూ ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేశాడట. ఇందులో హీరోయిన్ ఇంకా ఖరాదు కాలేదు కానీ.. వరలక్ష్మిని మాత్రం ఓ ముఖ్యమైన రోల్ కోసం గోపీచంద్ లైన్ లో పెట్టేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.