యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం `ఆర్ఆర్ఆర్` ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయింది. మరి కొన్ని గంటల్లోనే ఆస్కార్ ఫలితాలు బయటకు రానున్నాయి. యావత్ సినిమా ప్రపంచంలోనే అస్కార్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు.
సినిమా వాళ్లు ఈ అవార్డు రావడం ఒక వరంగా భావిస్తారు. ఇప్పుడు 95వ అస్కార్ అవార్డు వేడుకలు దగ్గరవ్వడంతో.. భారత ప్రజలందరూ `ఆర్ఆర్ఆర్` ఖచ్చితంగా ఆస్కార్ తెస్తుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. మార్చి 13న జరగబోయే ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ మూడు వారాల ముందే ఆమెరికా వెళ్లారు. అక్కడ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
`నాటు నాటు` పాటకు ఆస్కార్ రావడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు తేల్చాయి. అయితే ఇలాంటి తరుణంలో `ఆర్ఆర్ఆర్`కు బిగ్ షాక్ తగిలింది. ఆస్కార్ వేడుకలకు మూడు రోజుల ముందు మార్చి 10న తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఆస్కార్ క్రేజ్ దృష్టా రీ రిలీజ్లోనూ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కనీస రెస్పాన్స్ కూడా రాలేదట. ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోయినట్లు తెలుస్తోంది. సొంత గడ్డపైనే ఇలా జరగడం `ఆర్ఆర్ఆర్` టీమ్కు పెద్ద షాకనే చెప్పాలి.