ఈ ఏడాది టాలీవుడ్ కు బాగానే కలిసి వచ్చింది. 2022 లో విడుదలైన చిత్రాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అలాగే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డ చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `రాధేశ్యామ్` మొదటి స్థానంలో నిలిచింది.
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం.. 2022 మార్చి 11న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా 7000 స్క్రీన్ లలో విడుదల అయినప్పటికీ.. గట్టిగా వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది.
థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా అన్ని వెర్షన్లు కలుపుకుని రూ. 86.41 కోట్లును రాబట్టగలిగింది. ఈ చిత్రానికి దాదాపు రూ. 196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వాలంటే రూ. 200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ, టాక్ అనుకూలంగా లేకపోవడం వల్ల లాంగ్ రన్ లో ఈ చిత్రం రూ.86.41 కోట్లు మాత్రమే వసూల్ చేయడంతో.. అటు ఇటుగా రూ. 120 కోట్లు నష్టాలు వాటిల్లాయనే టాక్ ఉంది.